స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్లలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాలేదు. ఫైనల్గా పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి సూపర్ హిట్ అందుకున్నారు శృతి. అయితే తరువాత కూడా శృతి హాసన్ కెరీర్ సాఫీగా సాగలేదు. నెమ్మదిగా కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాప్లు ఎదురవ్వటంతో శృతి సినిమాలకు దూరమైయ్యారు.
గత ఏడాది కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్.. లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ తెలుగు సినిమాకు శృతి హాసన్ ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు శృతి ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బలుపు సినిమాలో రవితేజకు జోడీగా నటించిన శృతి ఈ సినిమాలో మరోసారి మాస్ మహారాజ్తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు.