తండ్రికి మద్దతుగా శ్రుతి ప్రచారం

14 Apr, 2019 09:41 IST|Sakshi

పెరంబూరు: నటుడు కమల్‌హాసన్‌ మక్కళ్‌నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తన అభ్యర్థును గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. రాజకీయాల్లోకి తన వారసులెవరూ రారని ముందుగానే ప్రకటించారు. ఇటీవల తన తండ్రిని చూస్తుంటే తనకూ రాజకీయాలపై ఆసక్తి కలుగుతోందని ఆయన కూతురు, ప్రముఖ కథానాయకి శ్రుతిహాసన్‌ ఒక భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసిన శ్రుతి.. ఇప్పుడు తండ్రి రాజకీయ జీవితానికి ఏదో విధంగా తోడ్పడాలని భావించినట్లున్నారు. ట్విట్టర్‌ ద్వారా తన తండ్రికి మద్దతుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

నటి శ్రుతిహాసన్‌ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో పేర్కొంటూ నాన్నను చూసి గర్వపడుతున్నాను. భావితరాన్ని మెరుగుపరచడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా ఉత్తమమైనవన్నారు. ఆయన చర్యల్లో అది స్పష్టంగా తెలుస్తోందన్నారు. నాన్న పార్టీ అభ్యర్థులందరూ టార్చలైట్‌ గుర్తు ద్వారా వెలుగులోకి వస్తున్నారన్నారు. వారందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారని శ్రుతి పేర్కొన్నారు. అదే విధంగా ఆమె అభిమానుల భావాలను శ్రుతి ట్విట్టర్‌లో పేర్కొంటూ తండ్రికి ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ సంచలన నటినీ రాజకీయనాయకురాలిగా చూడవచ్చునేమో!

>
మరిన్ని వార్తలు