ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా

25 Feb, 2016 02:48 IST|Sakshi
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా

ఆ రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానంటున్నారు నటి శ్రుతీహాసన్. ఇంతకీ ఈ బ్యూటీ ఆతృత ఏమిటో చూద్దాం. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో శ్రుతీహాసన్ ఒకరు. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మకు అధిక క్రేజ్. ఆ తరువాతే తమిళం అయినా, హిందీ అయినా అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే విజయ్‌తో జతకట్టిన పులి చిత్రం శ్రుతీహాసన్ దూకుడుకు అడ్డుకట్ట వేసిందని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
 
  త్వరలో తన తండ్రి విశ్వనటుడు కమలహాసన్‌తో కలిసి నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. శ్రుతీహాసన్ ఇంత కాలంగా బహుభాషల్లో నటిస్తున్నా ఇంత వరకూ తన తండ్రితో కలిసి నటించలేదు. ఇన్నాళ్టికి అప్పా అమ్మా విళయాట్టు అనే చిత్రంలో ఆయనతో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో నిజ జీవిత పాత్రను అనగా తన తండ్రికి కూతురిగానే నటించనుండడం. మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటించనుండడం గురించి శ్రుతీ మాట్లాడుతూ నాన్నతో కలిసి నటించే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానన్నారు.
 
  ఇంతకు ముందు ఒకసారి అలాంటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాననీ వివరించారు. తాజాగా తన తండ్రితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే నాన్నతో కలిసి నటించడం అంత సులభం కాదనీ, అయినా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని తన పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాననీ అన్నారు. ఇక ఇతర విషయాలు ఆ దేవుడి చేతిలోనే ఉంటుందనే అభిప్రాయాన్ని శ్రుతీహాసన్ వ్యక్తం చేశారు.