ప్రచారం కోసం దిగజారను!

27 Apr, 2014 23:19 IST|Sakshi
ప్రచారం కోసం దిగజారను!

 గత వారం, పది రోజులుగా అంతర్జాలంలో ఎక్కడ చూసినా శ్రుతీహాసన్ ఫొటోలే. అవి అలాంటి ఇలాంటి ఫొటోలు కావు. చాలా గ్లామరస్ ఫొటోలన్నమాట. ‘ఎవడు’ సినిమాలో శ్రుతీహాసన్ చేసిన ‘నిన్ను చూడకుంటే చాలు...’ పాటకు సంబంధించిన ఫొటోలివి. మామూలుగా పాటల్లో కథానాయికలు చిట్టి పొట్టి దుస్తుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తుంటారు. వెండితెరపై చూసినప్పుడు కన్నా ఫొటోల రూపంలో చూసినప్పుడు ఆ ప్రదర్శన ఎబ్బెట్టుగా ఉంటుంది. ‘నిన్ను చూడకుంటే...’ పాట విషయంలో జరిగింది అదే. ఆ పాటలో శ్రుతి గ్లామరస్‌గా కనిపించినా, అశ్లీలంగా అయితే లేదు.
 
 కానీ, ఫొటోలు మాత్రం చాలా హాట్‌గా ఉన్నాయి. అవి బయటికెలా వచ్చాయో తనకు తెలియడంలేదని, చూసినవాళ్లు  ‘ప్రచారం కోసమే ఇలాంటి పోజులిచ్చావా’ అనడిగితే, షాక్ అయ్యానని శ్రుతి పేర్కొన్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారాల్సిన అగత్యం తనకు లేదని ఒకింత ఆవేదన, ఆగ్రహంతో అన్నారామె. ఈ ఫొటోల గురించి వివరంగా చెబుతూ -‘‘మామూలుగా షూటింగ్ లొకేషన్స్‌లో చిత్ర బృందానికి సంబంధించిన ఫొటోగ్రాఫర్లు రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తుంటారు.
 
 అభ్యంతరకరంగా ఉన్న ఫొటోలను ఆ సినిమాకి సంబంధించినవారే తీసేస్తారు. వాటిని బయటకు వెళ్లనీయరు. కానీ, నా ఫొటోలు బయటికి వచ్చేశాయ్. నేనీ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదల్చుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నా. వెబ్‌సైట్స్‌లో ఆ ఫొటోలను ఎవరు పెట్టారో తెలుసుకుంటా. నాకు సినిమా వెనక ఉన్న ప్రపంచం గురించి తెలియదు. ఏదేమైనా తెరపై, తెరవెనుక సినిమా కోసం పని చేస్తున్న అందర్నీ నా కుటుంబాన్ని నమ్మినంతగా నమ్మాను. కానీ, నమ్మకద్రోహం చేశారు. అందుకు చాలా చాలా బాధగా ఉంది’’ అన్నారు.