మళ్లీ సంగీతం వైపు!

28 Jul, 2018 08:51 IST|Sakshi

టీ.నగర్‌: మినిమం గ్యారెంటీ గాయనిగా చిత్ర సీమలోకి ఎంట్రీ అయిన బ్యూటీ శ్రుతిహాసన్‌. ఆ వెంటనే తండ్రి కమల్‌హాసన్‌ నటించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ చిత్రంలో సంగీత దర్శకురాలిగా అవతారమెత్తి సత్తా చాటుకుంది. అంతలోనే అందాల ఆరబోతకు అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించింది. ఈ అమ్మడు తమిళం, తెలుగు, హింది భాషాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. దీంతో శ్రుతి సంగీతానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ప్రస్తుతం శభాష్‌ నాయుడు చిత్రంలో నటిస్తున్న శ్రుతి, హిందీలో మహేష్‌ మంజ్రేకర్‌ చిత్రంలో కూడా నటిస్తోంది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతి కొన్ని సూపర్‌హిట్‌ పాటలను ఆలపించి ఆహుతులను మైమరపించింది. ఆ సమయంలో అమ్మడు మాట్లాడుతూ తాను మళ్లీ సంగీతం వైపు చూపు మరలించనున్నట్టు తెలిపింది. ఎక్కువ పాటలను పాడడమే కాదు, పాటల రచనపై కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెపింది. అదే సమయంలో తాను స్వయంగా రాసిన ఓ కవితను కూడా వినిపించింది. తన కవితలను ఇప్పటి వరకూ ఎవరికీ చూపలేదు, ఎక్కడా చదవలేదని తెలిపింది. చాలా కవితలనే రాశానని శ్రుతి వెల్లడించింది.

మరిన్ని వార్తలు