అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో విషాదం

6 Aug, 2018 10:50 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వియ్యంకుడు రాజన్‌ నందా గుర్గావ్‌ ఆసుపత్రిలో నిన్న రాత్రి చనిపోయినట్టు తెలిసింది. రాజన్‌ నందా, అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేత బచ్చన్‌ నందాకు మామయ్య. రాజన్‌ నందా కొడుకు నికిల్‌ నందాను శ్వేతా పెళ్లి చేసుకున్నారు. రాజన్‌ నందా చనిపోయినట్టు తెలియగానే బ్రహ్మాస్త్ర షూటింగ్‌లో భాగంగా బల్గేరియాలో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌ భారత్‌కు బయలుదేరారు. రాజన్‌ నందా కొన్ని గంటల క్రితమే స్వర్గస్తులయ్యారని అమితాబ్‌ తన బ్లాగ్‌ పోస్టు ద్వారా వెల్లడించారు. 

రాజన్‌ నందా..

‘మా బంధువు రాజన్‌ నందన్‌, నికిల్‌ తండ్రి, శ్వేత మామగారు మృతిచెందారు. భారత్‌కు బయలుదేరి వస్తున్నా’ అంటూ బిగ్‌ బి తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. ఎస్కార్ట్స్‌ గ్రూప్‌కు రాజన్‌ నందా చైర్మన్‌గా ఉండగా.. నికిల్‌ నందా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజన్‌ నందా, రాజ్‌ కపూర్‌ పెద్ద కూతురు రీతు నందాను పెళ్లి చేసుకున్నారు. రాజన్‌ నందా, రీతు నందాలకు నికిల్‌, నటాషాలు పిల్లలు. రాజన్‌ నందా మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు. నందా కుటుంబానికి బంధువు అయిన.. రిషి, నీతూ కపూర్‌ల కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని కూడా రాజన్‌ నందా మృతి వార్తను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మీరు మాకెప్పుడు లెజెండే. మమల్ని ఎప్పుడూ ప్రేమించినందుకు కృతజ్ఞతలు. మేము మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాం అంకుల్‌. రిప్‌ అంకుల్‌ రాజన్‌’ అని రాజన్‌ నందాకు నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు