రెండో పెళ్లిలో సమస్యలు ఎందుకు రావు

12 Nov, 2019 13:12 IST|Sakshi

‘మేరే డాడ్‌కి దుల్హాన్‌’ షోతో తిరిగి బుల్లితెరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉ‍న్నారు బాలీవుడ్‌ సీరియల్‌ నటి శ్వేతా తివారి. తన రెండో భర్త అభినవ్‌ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడని.. తన కూతురు పాలక్‌ తివారితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇటీవలే ఆయనపై గృహహింస కేసు పెట్టిన విషయం విదితమే. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి శ్వేతా వెల్లడించారు. ఈ క్రమంలో రెండో భర్త అభినవ్‌ కోహ్లిపై చేసిన ఆరోపణల నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఎంతోమంది కంటే తను బెటర్‌ అంటూ చెప్పుకొచ్చారు. అభినవ్‌ కోహ్లితో రెండో వివాహం శరీరంలో ‘విషపూరితమైన ఇన్‌ఫెక్షన్‌’ వంటిదని పోల్చి చెప్పారు. అది తనను తీవ్రంగా బాధించిందని అందుకే దాన్ని తొలగించుకున్నానని తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి అతనితో కలిసి జీవించలేను అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేగాక ప్రస్తుతం కెరీర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానన్నారు. 

ఆమె మాట్లాడుతూ.. ‘అనేక మంది రెండో పెళ్లి చేసుకున్నాక కూడా ఎలా సమస్యలు వస్తాయని అడుగుతున్నారు. అయితే వారిని నేనొకటి అడగాలనుకుంటున్నా. రెండో పెళ్లిలో సమస్యలు ఎందుకు రావు?. నేను కనీసం ధైర్యంగా బయటకు వచ్చి ఆ సమస్యలను చెప్పుకోగలుగుతున్నాను. పెళ్లయ్యాక కూడా చాలామంది తమ ప్రియుడు, ప్రియురాళ్లతో సంబంధం కొనసాగిస్తున్నారు. వారి కంటే నేను బెటర్‌ కదా. ఇక నా చేతుల్లో ఒక చేయి పనిచేయకపోతే రెండో చేతితో పనిచేసుకుంటాను. అంతేగానీ జీవించడం మానేయలేను. అలాగే జీవితంలో కొన్ని తప్పులు చేస్తే జీవించడం ఆపలేను. కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తా అంతే. నా పిల్లలు, వారి సంరక్షణ చూసుకోవడం, ఇంటిని చక్కదిద్దుకోవడం వంటి పనులు చూసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు