లిప్‌లాక్‌ అదిరింది

10 Oct, 2017 06:02 IST|Sakshi

తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తరువాత నటి ఆండ్రియాతో కలిసి అవళ్‌ అంటూ హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. అరణ్మణై–2 చిత్రం తరువాత సిద్ధార్థ్‌ కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే కొంచెం గ్యాప్‌ తీసుకుని అవళ్‌ చిత్రంతో ఏకంగా కథానాయకుడు, నిర్మాతగా రానున్నారు. ఈయన సొంత నిర్మాణ సంస్థ ఎడాకీ, వయాకాంమ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం అవళ్‌.

ఇందులో సిద్ధార్థ్‌తో సంచలన నటి ఆండ్రియా రొమాన్స్‌ చేయగా. ఇతర ముఖ్య పాత్రల్లో అతుల్‌ కులకర్ణి, సురేశ్, అనిషా విక్టర్, ప్రకాశ్‌ బెలవాడి, భావన అనేజా, ఖుషీ హజారే, యూసఫ్‌ హూసేన్, మందాకిని గోస్వామి నటించారు. వ్రేయాస్‌ క్రిష్ణ ఛాయాగ్రహణం, గిరీష్‌ సంగీతాన్ని అందించిన అవళ్‌ చిత్రానికి నటుడు సిద్ధార్థ్‌నే కథను అందించడం విశేషం. ఆయన చిరకాల మిత్రుడు మిలింద్‌ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్‌ మూడో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.

మా కల నెరవేరింది: సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆండ్రియా మాట్లాడుతూ తనకు అన్నీ వైవిధ్యభరిత కథా చిత్రాల అవకాశాలే వస్తున్నాయని, అలాంటి చిత్రాల్లో నటించడం కష్టతరమైనా, సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించడం సంతోషంగా ఉందని అంది. సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు మిలింద్‌ తనకు 17 ఏళ్ల మిత్రుడని తెలిపారు.

హాలీవుడ్‌ హర్రర్‌ చిత్రాలు ఎక్కువగా చూసేవాళ్లమని, ఎప్పటిౖకైనా హాలీవుడ్‌ స్థాయి హర్రర్‌ చిత్రాన్ని రూపొందించాలన్న తమ కల ఈ అవళ్‌ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. ఇది అలాంటి ఇలాంటి హర్రర్‌ చిత్రం కాదని, ఎలాంటి వారినైనా భయపెడుతుందని అన్నారు. చిత్రాన్ని నవంబర్‌ మూడో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సిద్ధార్థ్‌ వెల్లడించారు. చిత్ర ట్రైలర్‌ భయపెట్టినా, ఒక పాటలో మాత్రం సిద్ధార్థ్, ఆండ్రియాల లిప్‌లాక్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ చిత్రాలను మరపించేలా ఉన్నాయని చెప్పకతప్పదు.

మరిన్ని వార్తలు