అడిగి మరీ నటించాను

9 Sep, 2014 01:15 IST|Sakshi
అడిగి మరీ నటించాను

నిర్మాతను అవకాశం అడిగి మరీ ఎనకుళ్ ఒరువన్ చిత్రంలో నటించానని నటుడు సిద్దార్థ్ తెలిపారు. ఈయన ప్రస్తుతం తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన జిగర్‌తండా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న చిత్రం ఎనకుళ్ ఒరువన్. ఇది ఇంతకు ముందు కమల్‌హాసన్ నటించిన చిత్రం టైటిల్. తిరుకుమరన్ ఎంటర్ టెయిన్‌మెంట్, సీవీ కుమార్ అబి టీసీఎస్ మీడియా అభినేష్ ఇళంగోవన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ సరసన కన్నడ నటి దీపా సన్నిధి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పిజ్జా చిత్రానికి కార్తిక్ సుబ్బరాజ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ప్రసాద్ రామన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇది కన్నడంలో సక్సెస్ అయిన లూసియా చిత్రానికి రీమేక్. సంతోష్ నారాయణ్ సంగీత బాణీలందిస్తున్న చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నటుడు సిద్దార్థ్ మాట్లాడుతూ కన్నడంలో ఘన విజయం సాధించిన లూసియా చిత్రం చూసి తమిళ హక్కుల్ని తాను పొందాలనుకున్నానన్నారు. అయితే అప్పటికే నిర్మాత సీవీ కుమార్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారని తెలిసి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఈ చిత్రంలో నటించే అవకాశం తనకు ఇవ్వమని అడిగి మరీ నటించానన్నారు. ఇంతకు ముందు తన చిత్రాల్లో చెయ్యని పలు విషయాలను ఈ ఎనకుళ్ ఒరువన్ చిత్రంలో చేశానన్నారు.  

కన్నడంలో ఈ చిత్రాన్ని పవన్‌కుమార్ సుమారు పది వేల మంది వద్ద డొనేషన్ వసూలు చేసి తెరకెక్కించడం విశేషం అన్నారు. చిత్ర దర్శకుడు ప్రసాద్ రామన్ మాట్లాడుతూ చిత్ర టీమ్ కథకు స్ఫూర్తి చెంది నటించిన చిత్రం ఎనకుళ్ ఒరువన్ అని తెలిపారు. చిత్రంలో అన్ని పాత్రలు రెండు షేడ్స్‌తో కనిపించడం విశేషం అన్నారు. చిత్రానికి సంతోష్ నారాయణ్ బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారన్నారు. చిత్రాన్ని తమిళనాడులో రేడియన్స్ మీడియా వరుణ్ మణియన్, వైనాట్ శశి సంయుక్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సి.వి.కుమార్ వెల్లడించారు.