దానపత్రంపై అమ్మడి సంతకం

28 May, 2014 23:27 IST|Sakshi
దానపత్రంపై అమ్మడి సంతకం

ఎప్పుడూ పేజ్ త్రీలో ప్రముఖంగా కనిపించే త్రిష సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో నిలుస్తారు. నోరు లేని జీవాలంటే త్రిషకు ఎనలేని ప్రేమ. ముఖ్యంగా శునకాలపై అపారమైన కరుణ చూపుతారామె. ప్రతి పుట్టిన రోజుకీ అభిమానులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడంతోపాటు, క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లలతో గడపడం, వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి పలు సేవా కార్యక్రమాలకు పూనుకొంటున్నారు. వీధి కుక్కలను తీసుకొచ్చి వాటి సంరక్షణ బాధ్యతల్ని చేపడుతున్నారు.
 
 తాజాగా ఆమె మరో ముందడుగు వేసి అవయవ దానానికి సిద్ధపడ్డారు. మరణానంతరం తన అవయవాలను ఇతరులకు ఉపయోగించుకోవచ్చునంటూ త్రిష ఒక పత్రంపై సంతకం చేశారు. దీంతో త్రిష సేవా గుణాన్ని సినీ ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఇదే బాటలో నటి సోనా కూడా పయనిస్తున్నారు. ఆమె కూడా అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు.