కోర్టుకెక్కిన శింబు.. విశాల్‌కు నోటీసులు

9 Jan, 2019 11:48 IST|Sakshi
శింబు , విశాల్‌

పెరంబూరు: నటుడు శింబు కోర్టుకెక్కి నటుడు విశాల్‌కు షాక్‌ ఇచ్చాడు. చర్చనీయాంశ నటుడిగా ముద్ర వేసుకున్న శింబు ఈసారి వార్తల్లోకి కాదు కాదు కోర్టుకెక్కారు. శింబు హీరోగా మైకెల్‌రాయప్పన్‌ 2017లో అన్భానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆధిక్‌. రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఈ కారణంగా శింబుకు నిర్మాత మైకెల్‌ రాయప్పన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చిత్ర నిర్మాత శింబు సరిగా షూటింగ్‌కు రానందువల్ల, తను కథలో జోక్యం కారణంగానే చిత్రం ఫ్లాప్‌ కావడంతో పాటు తనకు భారీ నష్టాన్ని మిగిల్చిందని, కాబట్టి తనకు నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీనిపై వివరణ కోరుతూ నిర్మాతల మండలి శింబుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆ నోటీసులకు శింబు బదులివ్వలేదని, దీంతో ఆయనపై రెడ్‌ కార్డు విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే శింబు మాత్రం కొత్త చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు శింబు నిర్మాతల మండలి అ«ధ్యక్షుడు విశాల్, అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్ర నిర్మాత మైకెల్‌ రాయప్పన్‌లపై చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అందులో తాను నటించిన అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రానికి రూ.8 కోట్లు పారితోషికం ఒప్పందం చేసుకున్నా, ఆ చిత్ర నిర్మాత రూ.5 కోట్లే చెల్లించాడని, అంతేగాకుండా తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ కట్ట పంచాయితీ చేస్తున్నాడని ఆరోపించాడు. తనపై అసత్య ప్రచారం చేసిన నిర్మాత మైకెల్‌ రాయప్పన్‌పై పరువు నష్టం దావా కింద కోటి రూపాయలను చెల్లించేలా ఆదేశించాలని, అదే విధంగా తన కొత్త చిత్రాల విషయంలో నిర్మాతల మండలి గానీ, నటీనటుల సంఘం కానీ జోక్యం చేసుకోరాదని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి కల్యాణసుందరం సమక్షంలో కోర్టులో విచారణ జరిగింది. శింబు తరఫు వాదనలను విన్న న్యాయమూర్తి బదులు పిటిషన్‌ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైకెల్‌రాయప్పన్, విశాల్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18 తేదీకి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు