శింబు చుట్టూ కుట్ర జరుగుతోంది

3 Sep, 2018 09:14 IST|Sakshi

పెరంబూరు: శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని ఆయన తండ్రి, నటుడు, దర్శక నిర్మాత, లక్ష్య డీఎంకే పార్టీ అధ్యక్షుడు టీ.రాజేందర్‌ అన్నారు. ఆదివారం సేలంకు వెళ్లిన ఈయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయ వనవాసం ముగిసిందని అన్నారు. ఇప్పుడు విముక్తి కలిగిందని అన్నారు. రాజకీయాల్లో తాను ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినని చెప్పారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని వెటకారంగా మాట్లాడారు.

రాజకీయ పార్టీని ప్రారంభించడానికి చాలా సహనం అవసరం అని అన్నారు. పోరాటం తరువాత కరుణానిధి డీఎంకే అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. కరుణానిధి ఉండగా ఎన్నికలను ఎదుర్కోవడం వేరు ఆయన లేని ఇప్పటి డీఎంకే ఎదుర్కొనే ఇప్పటి పరిస్థితులు వేరు అని అన్నారు. చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి అన్నది సాధారణ విషయం కాదని, తల చుట్టూ వేడెక్కించే మంట లాంటిదని పేర్కొన్నారు. తాను రాజకీయవాదినని చెప్పడం  కంటే ఆధ్యాత్మిక వాదినని చెప్పుకుంటానన్నారు. తాను ఆధ్యాత్మికంగానే నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆయన కొడుకు, నటుడు శింబుకు సంబంధించిన కేసులో శనివారం మద్రాసు హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి స్పందిస్తూ శింబు చుట్టూ కుట్ర జరుగుతోందని టి.రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు