అతిథిగా శింబు

9 Jul, 2018 08:06 IST|Sakshi

తమిళసినిమా: సంచలనాలకు కేంద్రబిందువు శింబు అంటారు. సమయానికి షూటింగ్‌లకు రాకుండా దర్శక, నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తాడని, కథలో జోక్యం చేసుకుంటాడని చాలా ఆరోపణలే ఆయనపై ఉన్నాయి. ఇవన్నీ శింబుకు తెలుసు. అందుకే ఇకపై వేరే శింబును చూస్తారని, షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తున్నాడనే ఆరోపణలు రావని, ఇటీవల చెప్పడం ఒక షాక్‌ అయితే, మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం, సెక్క సివంద వానం చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడం వంటివి శింబు నుంచి ఆశించనివే. తాజాగా నటి జ్యోతిక చిత్రంలో అతిథిగా మెరవడానికి అంగీకరించడం ఇంకా విశేషం. అవును నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాట్రిన్‌ మొళి. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సుళు చిత్రానికి రీమేక్‌ అన్నది గమనార్హం.

ఇందులో విద్యాబాలన్‌ పాత్రను జ్యోతిక పోషిస్తున్నారు. రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జ్యోతిక భర్తగా విథార్థ్‌ నటిస్తున్నారు. హిందీలో నేహా నటించిన పాత్రను తెలుగు నటి లక్ష్మీమంచు చేస్తున్నారు.ఎంఎస్‌.భాస్కర్, మనోబాలా, కుమారవేల్, మోహన్‌రామన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఇందులో ఒక కీలక పాత్రలో నటుడు శింబు నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ధనుంజయన్‌నే తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.శింబు కాట్ట్రిన్‌ మొళి చిత్రంలో చేరడంతో ఆ చిత్ర కలరే మారిపోయింది. శింబు, జ్యోతికలది హిట్‌ పెయిర్‌. గతంతో వీరిద్దరూ కలిసి మన్మథ చిత్రంలో నటించారన్నది గమనార్హం. చాలా కాలం తరువాత మళ్లీ కలిసి నటించడం విశేషమే.

మరిన్ని వార్తలు