సమస్యల్లో శింబు, నయనల చిత్రం?

31 Jul, 2014 23:52 IST|Sakshi
సమస్యల్లో శింబు, నయనల చిత్రం?

 శింబు, నయనల చిత్రం ఇదు నమ్మ ఆళు సమస్యల్లో చిక్కుకుందా! ప్రస్తుతం కోలీవుడ్ హాట్‌గా చర్చించుకుంటున్న అంశం ఇదే. ప్రారంభానికి ముందే సంచలనం కలిగించిన చిత్రం ఇదు నమ్మ ఆళు. ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకుని ఆ తరువాత విడిపోయిన మాజీ ప్రేమ జంట శింబు, నయనతార కలసి నటించడమే అందుకు కారణం. దీంతో చిత్రం వ్యాపార వర్గాల్లో కూడా వేడి పుట్టించింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు శింబునే సొంతంగా నిర్మించడం,
 
 ఆయన తమ్ముడు కురలరసన్ తొలిసారిగా సంగీతాన్ని అందించడం...అలాగే పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సెలైంట్‌గా శరవేగంగా జరుపుకుంది. అలాంటి చిత్రానికి అనూహ్యంగా సమస్యలు ఎదురైనట్లు సమాచారం. చిత్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమలోని ఒక వర్గం టాక్. కాగా దర్శకుడు పాండిరాజ్‌కు, శింబుకు మధ్య విభేదాల కారణంగా ఇదు నమ్మ ఆళు చిత్ర షూటింగ్ జాప్యానికి కారణం అని మరో వర్గం ప్రచారం చేస్తోంది. దర్శకుడు పాండిరాజ్ ప్రస్తుతం సూర్య నిర్మించనున్న చిత్రానికి కథను తయారు చేసే పనిలో ఉన్నారనే చర్చ ఉంది.
 
 ఇలా శింబు, నయనతారల చిత్రంపై రకరకాల వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఇదు నమ్మ ఆళు చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్న శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టి.రాజేందర్ స్పందిస్తూ తమ చిత్రంపై అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. ఈ చిత్రం విషయంలో ఎవరికీ ఎవరితోను వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఇదు నమ్మ ఆళు చిత్రం తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి చిత్రంగా రూపొందుతుందనే ఆశాభావాన్ని టి.రాజేందర్ వ్యక్తం చేశారు.