ధనుష్‌ కాదు శింబు

29 Mar, 2018 06:27 IST|Sakshi

తమిళసినిమా: ఏ భాషలోనైనా చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంటే వెంటనే ఆ చిత్ర రీమేక్‌ హక్కులకు పోటీ సహజం. ఇటీవల తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న చిత్రం నీది నాది ఒకే కథ. వర్థమాన నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఇందులో బిచ్చగాడు చిత్రం ఫేమ్‌ సాట్నా టిటస్‌ కథానాయకిగా నటించింది. టాలీవుడ్‌లో ఈమెకిది తొలి చిత్రం. 

ఊడుగుల వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. దీంతో కోలీవుడ్‌ దర్శక, హీరోల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం నటుడు ధనుష్‌కు తెగ నచ్చేసిందని, వెంటనే తమిళరీమేక్‌ హక్కులను ధనుష్‌ కొనేశారని ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ధనుష్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో వడచెన్నై, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఎన్నై నోక్కిపాయుమ్‌ తూట్టా, బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో మారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. 

తదుపరి నీది నాది ఒకే కథ రీమేక్‌లో నటిస్తారని ప్రచారం. అయితే తాజా గా నీది నాది ఒకే కథ చిత్రంలో ధనుష్‌ను కాదని, సంచలన నటుడు శింబు నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.  అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రం ఫ్లాప్‌తో షాక్‌ తిన్న శింబు ఆ చిత్రం నిర్మాత నుంచి నష్ట పరిహారం లాంటి డిమాండ్లను ఎదుర్కొన్నారు. చాలా గ్యాప్‌ తరువాత ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో సెక్క సి వక్క వానం చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు