అభిమానికి స్టార్‌ హీరో అశ్రు నివాళి

20 May, 2018 13:20 IST|Sakshi
శింబు పోస్టర్లు అంటిస్తున్న దృశ్యం.. (ఇన్‌సెట్‌లో మదన్‌తో శింబు పాత చిత్రం)

సాక్షి, చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ శింబు(శిలంబరసన్‌) హిట్‌ కొట్టి దశాబ్దంపైనే అవుతోంది. అయినా ఆయన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వివాదాల్లో చిక్కుకున్న సమయంలో కూడా ఆ అభిమానులే ఆయనకు అండగా నిలిచారు. అలాంటి ఫ్యాన్స్‌ కోసం శింబు కూడా అదే స్థాయిలో స్పందిస్తుంటాడు. ఆర్థికంగా ఎందరినో ఇప్పటికే ఆదుకున్నాడు కూడా. తాజాగా మరో అభిమాని కోసం శింబు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. 

టీనగర్‌కు చెందిన మదన్‌ అనే వ్యక్తి పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మదన్‌ ఎస్‌టీఆర్‌(శింబు) ఫ్యాన్‌ క్లబ్‌ కార్యదర్శి. బీప్‌ సాంగ్‌ వివాద సమయంలో మదన్‌ శింబుకు మద్ధతుగా సోషల్‌ మీడియాలో పెద్ద క్యాంపెయిన్‌ నడిపాడు కూడా. అలాంటి మదన్‌ మృతి చెందంటంతో శింబు చలించిపోయాడు. అయితే ఆ సమయంలో దుబాయ్‌లో షూటింగ్‌లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. తిరిగొచ్చాక ఆశ్రునివాళి పేరిట పోస్టర్లను రూపొందించి నగరంలో మొత్తం అంటించాలని ఫ్యాన్స్‌ అసోషియేషన్‌కు సూచించాడు. అంతేకాదు తానే స్వయంగా ఆ కార్యక్రమంలో శింబు పాల్గొన్నాడు. మదన్‌ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, వారికి చేతనైనంత సాయం అందిస్తానని శింబు మీడియాకు తెలిపాడు.

మరిన్ని వార్తలు