మారిపోయిన శింబు

21 Mar, 2018 11:02 IST|Sakshi
తమిళ హీరో శింబు

తమిళసినిమా: కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన శింబులో ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారన్న ఆరోపణలు ఎదుర్కొనే శింబు తాజాగా మణిరత్రం చిత్ర షూటింగ్‌కు చెప్పిన టైమ్‌ కంటే ముందుగానే వస్తూ చిత్ర యూనిట్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారట. ఇక ఆ మధ్య నడిగర్‌ సంఘం కార్యదర్శి విశాల్‌తో విబేధించిన శింబు ఇటీవల పైరసీలకు పాల్పడుతున్న వెబ్‌సైట్‌ను పోలీసులు మూసివేయడంతో ఆ ఘనత విశాల్‌దే అంటూ ప్రశంసించి అందరినీ విస్మయపరిచారు. 

తాజాగా యువ నటుడు మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజాలపై అభినందనల వర్షం కురిపించారు. మెట్రో శిరీష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం రాజా రంగూస్కీ. ఇందులో ఆయన పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని నా యారన్ను తెరియుమా అనే పాటను ఈ నెల 15న విడుదల చేశారు. విశేషం ఏమిటంటే ఇంతగా అలరిస్తున్న ఈ పాటను ఆలపించింది నటుడు శింబునే. 

దీంతో పాట మంచి సక్సెస్‌ కావడంతో రాజా రంగూస్కీ చిత్ర హీరో మెట్రో శిరీష్, సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజాలను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. దీంతో వీరు యమ ఖుషీ అయ్యిపోయారట. పాట హిట్‌ అయినట్లే చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని చెప్పి మెట్రో శిరీష్, యువన్‌శంకర్‌రాజాలను సంతోషపరచారు శింబు. రాజా రంగూస్కీ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబుతోంది.

మరిన్ని వార్తలు