అది ప్రేమ కాదు

15 Mar, 2018 10:30 IST|Sakshi

సాక్షి, సినిమా : నటి త్రిషపై తనకున్నది ప్రేమ కాదు అన్నారు సంచలన నటుడు శింబు. సంచలనాలకు మారు పేరు శింబు అన్నంతగా వాసికెక్కిన ఈ నటుడు అన్భానవతన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రం తరువాత మరో చిత్రంలో నటించలేదు. చాలా గ్యాప్‌ తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటిస్తున్నారు. ఈ దర్శకుడు శింబును హీరోగా ఎంపిక చేసుకోవడం కూడా సంచలనమే. శింబు ఇంతకుముందు నటి త్రిషతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి విన్నైతాండి వరువాయా చిత్రం. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అంతే కాదు శింబు, త్రిషల గురించి వదంతులు బాగానే హల్‌చల్‌ చేశాయి.

తాజాగా విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు గౌతమ్‌మీనన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నటుడు మాధవన్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నటుడు శింబు ఇటీవల ఒక ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో త్రిష గురించి అడిగిన ప్రశ్నకు ఆమె తనకు చిన్నతనం నుంచి తెలుసని అన్నారు. త్రిష నటి అవుతుందని ఊహించలేదన్నారు. త్రిష గురించి చెప్పాలంటే తను ఎలాంటి గర్వం చూపించదు. ఏ విషయం గురించి అయినా తనతో పంచుకుంటుందని చెప్పారు. అయితే తమ మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం కూడా కాదని అన్నారు. అభిమానం, ఆదరణ అని ఘనంగా చెప్పగలనని అన్నారు.

మరిన్ని వార్తలు