బాలూగారు తన సొంత ఖర్చుతో నాకు సంగీతం నేర్పించారు : మల్లికార్జున్

22 Sep, 2014 23:48 IST|Sakshi
బాలూగారు తన సొంత ఖర్చుతో నాకు సంగీతం నేర్పించారు : మల్లికార్జున్

 పాట... మల్లికార్జున్‌ని వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఆ పాటే... అతణ్ణి హైదరాబాద్ నుంచి చెన్నయ్ వైపు నడిపించింది. మల్లికార్జున్‌ని ఓ ఇంటివాణ్ణి చేసింది కూడా పాటే. అతడికి ఓ సద్గురువుని ప్రసాదించిందీ పాటే. తక్కువ సమయంలోనే మంచి సింగర్‌గా పేరు తెచ్చుకున్న మల్లికార్జున్‌తో ‘సాక్షి’ ముచ్చట్లు...
 
 మీ తరం గాయకులంతా హైదరాబాద్‌లో ఉంటే... మీరేంటి చెన్నయ్‌లో?
 ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు నన్ను హైదరాబాద్ నుంచి చెన్నయ్ తీసుకెళ్లి, తన సొంత ఖర్చుతో నాకు సంగీతం నేర్పించారు. రహమాన్, మణిశర్మ, కోటి... ఇలా గ్రేట్ మ్యూజిక్ డెరైక్టర్లందరికీ ఫోన్లు చేసి మరీ నా గురించి చెప్పారు. ఎన్నో అవకాశాలిప్పించారు. ఎవరి పాటలు వింటూ పెరిగానో.. ఆయన సాంగత్యంలోనే బతకడం ఆనందంగా ఉంది.
 
 అదేంటి... అంతమంది గాయకులుండగా బాలూగారికి మీ మీదే ఎందుకంత మక్కువ?
 అది నా అదృష్టం. మాది వైజాగ్. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం గురించి ప్రకటన వచ్చింది. అప్పటికే ఓ అయిదొందల పాటల పోటీల్లో పాల్గొని ఉంటాను. ఎక్కడ పాడినా... ఫస్ట్, సెకండ్ అంతే. బాలూగారి దృష్టిలో పడొచ్చని ‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కు వెళ్లా. అనుకోకుండా సెలక్ట్ అయ్యా. నా అదృష్టమో ఏమో కానీ... నేను పాడిన ప్రతి పాటా బాలూగారిని ఆకట్టుకుంది. నా సాటి సింగర్స్ ఎంతమంది ఉన్నా... బాలూగారు నన్నే స్వయంగా చెన్నయ్‌కి ఆహ్వానించారు.
 
 ప్లేబ్యాక్ సింగర్ కావాలని మీకు మొదట్నుంచీ ఉండేదా?
 చదువు, పాటలు, డాన్స్... ఈ మూడు తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. పదమూడేళ్ల వయసులో పట్రాయని సీతారామశాస్త్రి, నారాయణమూర్తిగార్ల వద్ద కీర్తనలు నేర్చుకున్నాను.. అంతే. ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనే ఆకాంక్ష మాత్రం లేదు. ఇప్పుడు దొరికిందంతా దేవుడు నాకు బోనస్‌గా ఇచ్చిందే.
 
 మణిశర్మ దగ్గర సహాయకునిగా పనిచేసినట్టున్నారు కదా?
 అవును... సినీ గాయకునిగా ఈ రోజు నాకు క్రేజ్ ఉందంటే కారణం మణిశర్మగారే. ఏ హీరో సినిమాకు ఆయన మ్యూజిక్ డెరైక్షన్ చేస్తే... ఆ హీరోకి నాతో పాడించేవారు.
 
 గాయకునిగా మీ ప్రస్థానం...
 వందేమాతరం శ్రీనివాస్‌గారు 1997లో ‘సింగన్న’ సినిమా కోసం నాతో ‘కలగంటి కలగంటి’ పాట పాడించారు. తొలిబ్రేక్ ఇచ్చింది దేవిశ్రీప్రసాద్‌గారు. ‘ఆనందం’ సినిమాలో ‘కనులు తెరిచినా.. కనులు మూసినా కలలు ఆగవేలా’ పాటతో సినీగాయకునిగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మణిశర్మగారి సంగీత సారథ్యంలో ‘ఆది’ సినిమా కోసం నేను పాడిన ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ పాట నాకెంత పేరు తెచ్చిందో తెలిసిందే. ఇక ‘ఇంద్ర’లో బాలూగారితో కలిసి పాడే అదృష్టాన్నీ మణిగారే కల్పించారు. ‘ఠాగూర్’లోని ‘మన్మథా మన్మథా మామ పుత్రుడా’ పాటైతే నా కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హిట్.
 
 ‘ఇంద్ర’లో ‘ఘల్లు ఘల్లు మని’ పాటలో పై స్థాయిలో వచ్చే ‘జడివాన జాడలో ఈ వేళ’ లైన్ ప్రత్యేకంగా మీతోనే పాడించారు మణిశర్మ. ఎందుకని?
 అది విచిత్రంగా జరిగింది. బాలూగారు పాడాల్సిన ఆ పాటకు ట్రాక్ పాడాను. కానీ... ఆ పాటలో పై స్థాయిలో వచ్చే ‘జడివాన జాడలో ఈ వేళ... జన జీవితాలు చిగురించేలా’ లైన్.. నేను పాడిన తీరు మణిగారికి బాగా నచ్చింది. అయితే... పాటంతా బాలూగారితో పాడించి, ఆ ఒక్క లైన్ నాతో పాడిస్తే బాగుండదు. కానీ... పాడించేశారు. మణిగారు ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయం అది. అంతేకాదు... అదే సినిమాలో ఉదిత్‌నారాయణగారు పాడిన ‘రాధే గోవిందా..’ పాటలో కూడా ఓ లైన్ పాడాను. అది ఎవరికీ తెలీదు. ఆ పాటలో వచ్చే ‘మృదువననా రతినై పరిపాలించనా...’ అనే లైన్ నేను పాడిందే. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఉదిత్‌గారు పాడిన ఆ లైన్ సరిగ్గా రాలేదు. ఆ ఒక్క లైన్ కోసం ఆయన్ను ముంబయ్ నుంచి పిలిపించడం బావుండదని నాతో అనిపించేశారు మణిశర్మగారు.
 
 మొత్తం ఎన్ని పాటలు పాడారు?
 ఓ రెండొందల పాటలు పాడి ఉంటాను. కానీ... తక్కువ పాటలు పాడినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోగలిగాను. ప్రస్తుతం గాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏ పాట ఎవరు పాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. కానీ... నా పాటను మాత్రం ‘ఇది మల్లికార్జున్ పాట’ అని గుర్తు పడతారు శ్రోతలు. ఆ గుర్తింపు చాలు.
 
 సరే... గోపికా పూర్ణిమతో మీ ప్రేమకథ గురించి చెప్పండి?
 ‘నువ్వే కావాలి’ సినిమా తరహాలోనే అనిపిస్తుంది మా జీవితం కూడా. ‘పాడుతా తీయగా’ టైమ్‌లోనే పరిచయమైంది. ఒకరినొకరం ఇష్టపడ్డాం. కానీ చెప్పుకోలేని పరిస్థితి. మా ఇద్దర్నీ బాలూగారు మద్రాస్ పిలిపించారు. కొన్నాళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే బాలూగారి పాట కచ్చేరీలకు ఆయనతో పాటు మేమిద్దరం కూడా వెళ్తుండేవాళ్లం. ఈ క్రమంలోనే మా కుటుంబాలూ కలిశాయి. ఓ సంక్లిష్ట పరిస్థితిలో ప్రేమను వ్యక్తం చేసుకున్నాం. బాలూగారి సమక్షంలోనే మా పెళ్లయ్యింది. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం.
 
 - బుర్రా నరసింహ, ఫొటో: వన్నె శ్రీనివాస్