వాళ్లపై చర్యలు తీసుకోండి : సునీత

22 Mar, 2020 16:55 IST|Sakshi

సోషల్‌ మీడియాలో అసందర్భంగా తన ఫొటోను వాడుకోవడంపై ప్రముఖ సింగర్‌ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్‌తోపాటు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్‌-19 పాజిటివ్‌ తేలిన సింగర్‌ కనికా కపూర్‌ న్యూస్‌కు థంబ్‌నైల్‌గా తన ఫొటో ఉంచడంపై సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అలాగే అందుకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌ షేర్‌ చేశారు. అలాగే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కేటీర్‌, మహేందర్‌రెడ్డి, తెలంగాణ సీఎంవోను కోరారు. తను క్షేమంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 

సునీత పోస్ట్‌ చేసిన ఫొటోను గమనిస్తే.. ‘ప్రముఖ సింగర్‌కు కరోనా పాజిటివ్‌ హాస్పిటల్‌కు తరలింపు’ అని పేర్కొన్నారు. ఆ పక్కన సునీత ఫొటోను బ్లర్‌ చేసి పెట్టారు. అలాగే ఓ మహిళ హాస్పిటల్‌ ఉన్న ఫొటోను కూడా ఉంచారు. ఈ విషయం సునీత దాకా వెళ్లడంతో ఆమె చాలా ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. కాగా, ఇటీవల బ్రిటన్‌ నుంచి తిరిగివచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు