మూడు సింహాలు

11 Oct, 2019 06:29 IST|Sakshi
రణ్‌వీర్‌ సింగ్, అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగణ్‌

‘కనిపించే మూడు సింహాలు నీతికీ, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్‌’ అంటూ ‘పోలీస్‌ స్టోరీ’ చిత్రంలో సాయికుమార్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలతో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలు తెరకెక్కిస్తుంటారు బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సింగం (అజయ్‌ దేవగణ్‌), సిం» (రణ్‌వీర్‌ సింగ్‌) సినిమాలు బాక్స్‌ఫీస్‌ దగ్గర స్ట్రిక్ట్‌ డ్యూటీ చేశాయి. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ను ‘సూర్యవన్షీ’ అనే సినిమాతో సూపర్‌ పోలీస్‌గా మార్చారు రోహిత్‌. అంతేకాదు.. సంఘ విద్రోహక శక్తులను మట్టి కరిపించడానికి ఈ మూడు సింహాలను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చారాయన. ‘సూర్యవన్షీ’ సినిమా క్లైమాక్స్‌లో అక్షయ్, అజయ్, రణ్‌వీర్‌ కలిసి పోరాడనున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు