ఒక్క సినిమా..రెండు కోట్లు!

11 Jun, 2014 22:51 IST|Sakshi
ఒక్క సినిమా..రెండు కోట్లు!

ఇన్నాళ్లకు... ఇన్నేళ్లకు నయనతార సొంత గొంతుని వినే అదృష్టం ప్రేక్షకులకు కలగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ పదేళ్లలో ఎన్నో సినిమాలు చేసిన నయనకు ఇంతవరకూ ఎవరెవరో డబ్బింగ్ చెప్పారు. తెలుగులో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో మాత్రం తొలిసారిగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆమె డబ్బింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పటివరకు తమిళ ప్రేక్షకులకు మాత్రం నయనతార గొంతు వినే భాగ్యం కలగలేదు. ఈ ఏడాది అక్కడి ప్రేక్షకులకు కూడా తన మధురమైన కంఠస్వరాన్ని వినిపించాలని నయనతార నిర్ణయించుకున్నారు.
 
  మాజీ ప్రియుడు శింబు సరసన నయనతార ‘ఇదు నమ్మ ఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ జంట నటిస్తున్న సినిమా ఇది. ఈ కథ, పాత్ర చెప్పి, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుందని అటు శింబు... ఇటు నయన్‌కి చెప్పి, జత కలిపారు ఈ చిత్రదర్శకుడు పాండిరాజ్. ఆ విషయంలో విజయం సాధించిన పాండిరాజ్, నయనతారతో డబ్బింగ్ కూడా చెప్పించేస్తున్నారు. ‘మీ గొంతు వినిపిస్తేనే పాత్ర ఎలివేట్ అవుతుంది’ అని నయనకి చెప్పడం,
 
 ఆమె ఒప్పుకోవడం జరిగింది. శింబు, నయనతార నటించడంవల్ల ఇప్పటికే ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది. ఇక, నయనతార గొంతు అదనపు ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొసమెరుపు ఏంటంటే.. తమ కలయికలో సినిమా అంటే.. బిజినెస్‌పరంగా చాలా క్రేజ్ ఉంటుందని గ్రహించిన నయనతార, ఇప్పటివరకూ ఏ సినిమాకీ తీసుకోనంత భారీ పారితోషికం తీసుకున్నారట. మామూలుగా ఒక సినిమా కోటి నుంచి కోటిన్నర రూపాయల లోపు తీసుకుంటారు. అంతకన్నా భారీ అంటే.. రెండు కోట్ల దాకా తీసుకొని ఉంటారని కోలీవుడ్ టాక్.