సస్పెన్స్‌ థ్రిల్లర్‌

26 Aug, 2019 00:11 IST|Sakshi
రాశి, నందితా శ్వేత, శివ కంఠమనేని

శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం  హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్‌. వెంకటేశ్వర రావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్‌ విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

నటుడు, నిర్మాత అశోక్‌కుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్‌ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ.

‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్‌ గాళ్‌గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్‌తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్‌. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్‌. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్‌ మరియో, మాటల రచయిత అంజన్‌ మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు