కథకు అంతం ఉంటుందా?

1 Feb, 2017 23:32 IST|Sakshi
కథకు అంతం ఉంటుందా?

సీరియల్స్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రానా ఎస్‌.కె. సింగ్‌ ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. మీనా బజార్‌’ చిత్రంతో హీరోగా మారుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. వైభవీ జోషి, మధుసూదన్, షాహీన, సత్యప్రకాష్, జీవా, వేణుగోపాల్, విదిష, విజయ ముఖ్య పాత్రల్లో నాగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు.

రానా ఎస్‌.కె. సింగ్‌ మాట్లాడుతూ– ‘‘అసలు కథ అంటే ఏమిటి ? కథకి అంతం ఉంటుందా? లేదా? కథ అన్నది సంఘటనలు లేదా పాత్రల మధ్య నడిచే సంఘర్షణా? అనే భిన్నమైన ప్రశ్నలకు సమాధానమే మా చిత్రం. సినిమా అంటే రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు. అందరికీ నచ్చేలా ఉండాలన్నదే మా ప్రయత్నం’’ అన్నారు. నిర్మాత కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్, చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మాధ్యు రాజన్, సంగీతం: మణికాంత్‌ ఖాద్రి.