నమ్మకాన్ని పెంచండి..భయాన్ని కాదు

24 Nov, 2015 12:46 IST|Sakshi

ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని నా భార్య అడుగుతోందన్న  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో  దుమారం కొనసాగుతోంది.   బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అనుపమ్ ఖేర్  అమీర్ వ్యాఖ్యలపై  ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.  పవిత్ర భారతదేశం అసహన భారతదేశంగా ఎపుడు మారిపోయిందని ప్రశ్నించారు.   ఏ దేశం వెళదామో మీ భార్య కిరణ్ చెప్పలేదా  అంటూ ట్విట్ చేశారు.    మరి ఏ  దేశం  మీకు అమీర్ ఖాన్ గా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో ఆమెకు తెలిపారా వ్యంగ్య బాణాలు విసిరారు.   చాలా కష్టాల్లో ఉన్నపుడు ఈ దేశమే మిమ్మల్ని ఆదుకుందనే విషయాన్ని  ఆమెకు చెప్పారా.. మరి  దేశం విడిచి పోయే ఆలోచన అప్పుడెందుకు చేయలేదన్నారు.  
దేశంలో అసహనం పెరుగుతోందన్న అమీర్ వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆయన . దేశంలో అసహనం పెరుగుతోంటే,  ప్రజలకు  ఇలాంటి  సలహానే ఇస్తారా అంటూ మండిపడ్డారు.  పవిత్రమైన దేశంలో అల్లర్లు చెలరేగితే పరిస్థితులు చక్కబడేదాకా  సంయమనం పాటించమని ప్రజలకు  పిలుపునిస్తారా లేక దేశం విడిచి పారిపొమ్మంటారా అని ప్రశ్నించారు.  దేశంలో పెరుగుతున్న అశాంతి గత ఏడెనిమిది నెలలునుంచే మీకు కనిపిస్తోందా అంటూ  అమీర్ పై విరుచుకుపడ్డారు.  సత్యమేవ జయతి  ప్రజల్లో. నమ్మకాన్న ఆశావహదృక్పథాన్ని పెంపొందించాలి తప్ప భయాన్ని కాదని అనుపమ్ ఖేర్ హితవు చెప్పారు.

కాగా దేశంలో రామ్నాథ్ గోయెంగా ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ దేశంలో  అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన చిన్నారుల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన  చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరేదేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని  చెప్పిన సంగతి తెలిసిందే.

 

>