అందుకు నేను బాధ్యురాలిని కాను

10 Mar, 2017 02:07 IST|Sakshi
అందుకు నేను బాధ్యురాలిని కాను

గాయని సుచిత్ర ట్విట్టర్‌ ద్వారా రాసలీలలంటూ పలువురు ప్రముఖ నటీనటుల ఫొటోలు, వీడియోలు కోలీవుడ్‌లో పెను కలకలాన్నే రేకెత్తిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే తమ గురించి కూడా అలాంటి దృశ్యాలు ప్రచారం అవుతాయేమోనని పలువురు తారలకు దడ పుడుతోందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. అయితే ఇంకా ఎవరెవరి రాసలీలలు ప్రచారం అవుతాయోయని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా గాయని సుచిత్ర ట్విట్టర్‌ దెబ్బకు నటీనటులు బెంబేలెత్తిపోతుంటే తాజాగా నటి మడోనా సెబాస్టియన్  మరో బాంబు పేల్చింది.

ఈ ప్రేమమ్‌ బ్యూటీ తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపింది. గాయనీ సుచిత్ర కూడా తన ట్విట్టర్‌ను హ్యాక్‌ చేశారనే వరుసగా రోజూ కొందరి ఆంతరంగిక విషయాలను విడుదల చేస్తూ అలజడి పుట్టించిన విషయం తెలిసిందే. తాజాగా మడోనా ట్విట్టర్‌ హ్యాక్‌ టాక్‌ ఎలాంటి కలకలానికి దారి తీస్తుందోనని తెగ ఇదైపోతున్నారు కోలీవుడ్‌ వర్గాలు. నటి మడోనా సెబాస్టియన్  మాత్రం తన ట్విట్టర్‌ ద్వారా ఎలాంటి విషయాలు వెలువడ్డా తనకు సంబంధం లేదని, అందుకు తాను బాధ్యురాలిని కాదని తెలివిగా ఎస్కేప్‌ అయ్యే ప్రయత్నం చేసింది.

అదే విధంగా తన ట్విట్టర్‌ను హ్యాక్‌ చేసిన వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నానని మడోనా సెబాస్టియన్  చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి ట్విట్టర్‌ హ్యాక్‌ వార్తలను ఎన్ని వినాల్సి వస్తుందో? వాటికి ఎందరు బలి కానున్నారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మడోనా విజయ్‌సేతుపతికి జంటగా నటించిన కవన్, ధనుష్‌ దర్శకత్వం వహించిన పవర్‌పాండి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. అంతే కాదు ఆ అమ్మడు హ్యూమన్  ఆష్‌ సమ్‌ఒన్  అనే ఆంగ్ల చిత్రంలోనూ నటిస్తోందన్నది గమనార్హం.