యస్‌...అంటున్నారా?

17 Dec, 2016 23:32 IST|Sakshi
యస్‌...అంటున్నారా?

సౌతిండియాలో సోనాక్షి సిన్హా ఒక్కటంటే ఒక్క సినిమా ‘లింగ’లో నటించారు. అది కూడా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ‘యస్‌’ అనేశారు. మరి, ఇప్పుడూ ‘యస్‌’ అంటున్నారా? లేదా? అనేది ఎదురు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడీ బాలీవుడ్‌ బ్యూటీని ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, అందగాడు అరవింద్‌ స్వామికి జోడీగా నటించమని అడిగారు. సిద్ధిఖీ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా ‘భాస్కర్‌ ద రాస్కెల్‌’ను తమిళంలో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో అరవింద్‌ స్వామి హీరో.

మొదట రజనీకాంత్‌ను ఈ రీమేక్‌లో నటించమని సంప్రదించారు. ఆయన ‘నో’ చెప్పేసరికి, అరవింద్‌ స్వామికి అవకాశం వచ్చింది. మాతృక తీసిన సిద్ధిఖీనే ఈ తమిళ రీమేక్‌కీ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో కూడా నయనతారను నటించమని అడగ్గా.. ఓసారి చేసిన పాత్రలో రెండోసారి నటించే ఉద్దేశం లేదని చెప్పారట! దాంతో సోనాక్షి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె కూడా కథ వినడానికి అంగీకరించారట. మరి, విన్నాక సోనాక్షి ఏమంటారో? వెయిట్‌ అండ్‌ సీ.