ఇంత చెత్త హోటలా..

22 Aug, 2014 00:19 IST|Sakshi
ఇంత చెత్త హోటలా..

తన జీవితంలో ఇంతకు ముందెప్పుడూ బస చేయని చెత్త హోటల్లో లింగా చిత్ర యూనిట్ తనకు రూమ్‌ను కేటాయించిందని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. కర్ణాటకకు చెందిన రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
 పస్తుతం కర్ణాటకలో చిత్రీకరణ జరుపుకుంటోంది. నటి సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈమె సీనియర్ హిందీ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురు. అయితే సోనాక్షి తన బసకు కనీస వసతులు కూడా లేని చెత్త హోటల్‌ను కేటాయించారని చిత్ర యూనిట్‌పై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇంటర్‌నెట్‌లో పేర్కొనడంతో కలకలం రేకెత్తించింది. ఈ విషయం రజనీ దృష్టికి రావడంతో ఆయన దిగ్భ్రాంతి చెందారని సమాచారం.
 
 అయితే సోనాక్షి ఫిర్యాదు గురించి లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ స్పందిస్తూ జోగ్‌ఫాల్స్ సమీపంలో మంచి హోటళ్లు ఎక్కువ లేవన్నారు. ఉన్నవాటిలో మంచి హోటళ్లను ఎంపిక చేసి చిత్ర యూనిట్‌కు బస ఏర్పాటు చేశామని వివరించారు. అయితే సోనాక్షి సిన్హా ఇంటర్‌నెట్‌లో ఫిర్యాదు చేసిన విషయం గురించి తనకు తెలియదన్నారు. పలువురు ఈ విషయమై ప్రస్తావించడంతో సోనాక్షిసిన్హా తన ఫిర్యాదును నెట్ నుంచి తొలగించారు.