ఆరెస్సెస్‌ చీఫ్‌పై హీరోయిన్‌ ఫైర్‌!

17 Feb, 2020 11:18 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్‌ భగవత్‌.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు.

‘‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై సోనం కపూర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్‌ అయ్యారు.  

మరిన్ని వార్తలు