నటుడు ధనుష్కు హిందీలో తొలి నాయకి సోనమ్కపూర్ అన్న విషయం తెలిసిందే. ప్రముఖ హిందీ దర్శకుడు బాల్కీ దర్శకత్వంలో ఈ జంట నటించిన రాంజనా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ బ్యూటీస్ కోలీవుడ్లో కనిపించడానికి ఇష్టపడుతుండడం చూస్తున్నాం. ప్రియాంకాచోప్రా, దీపికాపడుకోనే, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా పలువురు తమిళ చిత్రాల్లో నటించిన వాళ్లే. తాజాగా సోనమ్కపూర్ కోలీవుడ్లో నటనానుభవాన్ని చవిచూడడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
సూపర్స్టార్ రజనీకాంత్ రెండో కూతురు, తొలి క్యాప్చర్ మోషన్ చిత్ర దర్శకురాలు సౌందర్యరజనీకాంత్ కోచ్చడైయాన్ చిత్రం తరువాత కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ప్రప్రథమంగా తండ్రి రజనీకాంత్ను డెరైక్ట్ చేసిన సౌందర్య ఇప్పుడు బావ(అక్క మొగుడు)ధనుష్ను డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడీ కోపం అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో ధనుష్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సమాచారం.
ఆయనకు జంటగా రాంజనా హిందీ చిత్రం ఫేమ్ సోనమ్కపూర్ నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో మరో ముఖ్య పాత్రను మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ వారసుడు ప్రణవ్ పోషించనున్నారట. ఆయన కోలీవుడ్కు పరిచయం అవుతున్న చిత్రం ఇదే అవుతుంది. రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించనుండడం మరో విశేషం. సీన్ లోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.