మహేశ్‌ బ్యానర్‌లో శేష్‌

28 Feb, 2019 02:32 IST|Sakshi
అడివి శేష్‌

ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, హీరో మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ జి.మహేశ్‌బాబు (జిఎంబి) ఎంటర్‌టైన్‌మెంట్‌ కలయికలో ‘మేజర్‌’ అనే భారీచిత్రం రూపొందనుంది. అడివి శేష్‌ హీరోగా నటించనున్నారు. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అడివి ఎంటర్‌టైన్మెంట్, శరత్‌చంద్ర, ఎ+జి మూవీస్‌ సహ నిర్మాతలు. ఈ ఏడాది వేసవిలో షూటింగ్‌ ప్రారంభించి, 2020లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చర్స్‌ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి కమెండో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ హెడ్‌ లెయినె క్లెయినె మాట్లాడుతూ– ‘‘ప్యాడ్‌ మాన్, 102 నాటౌట్‌’ వంటి బాలీవుడ్‌ చిత్రాలతోపాటు మలయాళ చిత్రం ‘9’ని ప్రేక్షకులకు అందించి వారికి దగ్గరయ్యాం.

మన దేశంలోని వారిని, సరిహద్దులను దాటి ఉన్న భారతీయులను ఇన్‌స్పైర్‌ చేసే చిత్రం ‘మేజర్‌’’ అన్నారు. ‘‘మహేశ్‌గారు, నమ్రతగారితో అసోసియేట్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ కృష్ణాని అన్నారు.  జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నమ్రత మాట్లాడుతూ– ‘‘ఇండియన్‌ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాలను తీసుకొచ్చేలా సోనీ పిక్చర్స్‌తో కలిసి ముందుకు వెళ్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు