అట్లీకి ఓకే చెప్పిన షారుఖ్‌!

11 Apr, 2019 14:17 IST|Sakshi

కోలీవుడ్‌లో వరుస విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ బాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖరారైంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి అట్లీ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మెర్సల్‌ రీమేక్‌పై షారుఖ్‌ ఆసక్తి చూపడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అట్లీ సన్నిహితులు తెలిపారు. ఈ రీమేక్‌తో పాటుగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కన్ను మరో సినిమాలో నటించేందుకు కూడా షారుఖ్‌ సుముఖత వ్యక్తం చేయడంతో ఇరువురి ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ఐపీఎల్‌ సీజన్‌12లో భాగంగా చెన్నై- కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం అట్లీ ఆఫీసుకు వెళ్లిన షారుఖ్‌ రెండు స్క్రిప్టులను ఫైనల్‌ చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కాగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ.. రాజా-రాణి సినిమాతో దర్శకుడిగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్‌ హీరో విజయ్‌తో తెరి, మెర్సల్‌ వంటి హిట్‌ సినిమాలు రూపొందించి పలు అవార్డులు కూడా పొందాడు. ప్రస్తుతం విజయ్‌తో దళపతి63 సినిమా తెరకెక్కిస్తున్న అట్లీ.. షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇక జీరో సినిమా డిజాస్టర్‌ కావడంతో నిరాశ చెందిన షారుఖ్‌ ఇంతవరకు ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే అట్లీ మీద ఉన్న నమ్మకంతో అతడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు