నయనపై దర్శక నిర్మాతల విమర్శలు

9 Jan, 2020 08:58 IST|Sakshi

దక్షిణాది అగ్రనటి నయనతారపై తాజాగా విమర్శల దాడి జరుగుతోంది. సంచలన నటి మాత్రమే కాకుండా, అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోíÙకం డిమాండ్‌ చేస్తున్న నటిగానూ ఈ అమ్మడికి పేరుంది. ఆ మధ్య యువ హీరోలతో జత కట్టిన నయనతార ఇప్పుడు వరుసగా స్టార్‌ హీరోలతోనే నటిస్తోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్‌ చేసిన బిగిల్‌(తెలుగులో విజిల్‌) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అదేవిధంగా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది. తాజా రజనీకాంత్‌తో జత కట్టిన దర్బార్‌ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ప్రస్తుతం తన ప్రియుడిని నిర్మాతగా చేసి నెట్రికన్‌ అనే చిత్రంతో పాటు, ఆర్‌జే.బాలాజీ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్‌ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండూ కథానాయకి పాత్రలకు ప్రాధ్యానత కలిగిన చిత్రాలే కావడం విశేషం. 

ఇలా నటిగా బిజీగా ఉన్న నయనతార ఇటీవల ఒక టీవీ చానల్‌ నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది అనడం కంటే విమర్శలను కొని తెచ్చుకుందనే చెప్పాలి. కారణం లేకపోలేదు. నయనతార తాను నటించిన చిత్రాకు సంబంధించి ఎలాంటి  ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గనదనే విషయం తెలిసిందే. చిత్రంలో నటించామా, అంతటితో తన పని అయిపోయ్యింది అని సరిపెట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో నయనతారపై చాలా కాలంగా అసంతృప్తి దర్శక నిర్మాతల్లో రగులుతోంది. అయితే అదంతా లోలోనే మండుతోంది. కారణం తను అగ్ర నటిగా వెలుగొందడం కావచ్చు. 

కాగా ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల పారితోషకం డిమాండ్‌ చేస్తూ నటిస్తున్న నయనతార ఆ చిత్రాల ప్రమోషన్‌కు మాత్రం రాదు గానీ, అవార్డుల అందుకోవడానికి మాత్రం రెడీ అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లలో పారితోషకం చెల్లిస్తున్న నిర్మాతల చిత్రాల వ్యాపారం కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనవలసిన బాధ్యత నటీనటులకు ఉంటుందని, దాన్ని నయనతార విస్మయిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విజయ్‌ వంటి వారు కూడా తమ చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాంటిది నయనతార వారి కంటే ఎక్కువా? అనే చర్చ జరుగుతోంది. 

ఈ వ్యవహారం నడిగర్‌ సంఘం వరకూ వెళ్లిందని, ఆమె పారితోషికం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సంఘం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ విషయం ఇలా ఉంటే, నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ సహజీవినం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారి మధ్య ప్రేమకు బ్రేకప్‌ అయ్యిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా నటి నయనతార ఇటీవల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ధరించి వెళ్లిన చీరతోనే ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో సెల్ఫీ దిగి ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు