‘పందెంకోడి’ తర్వాత  ‘అభిమన్యుడు’ 

5 Jun, 2018 00:29 IST|Sakshi

‘అభిమన్యుడు’ సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్‌ అయ్యింది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. మంచి హిట్‌ కోసం నాలుగేళ్లుగా వెయిట్‌ చేసిన నాకు ఈ సక్సెస్‌ సంతోషాన్నిచ్చింది’’ అని నిర్మాత గుజ్జలపూడి హరి అన్నారు. విశాల్, సమంత జంటగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఇరుంబు తిరై’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో జి.హరి  ‘అభిమన్యుడు’ పేరుతో ఈ నెల 1న విడుదల చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్‌ దశ నుంచే నాకీ సినిమా గురించి తెలుసు. గ్యారంటీ హిట్‌ అని నమ్మాను. డిజిటల్‌ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలను మిత్రన్‌ బాగా తెరకెక్కించడంతో ‘అభిమన్యుడు’కి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. విశాల్‌కి సామాజిక బాధ్యత ఎక్కువ.

ఈ చిత్రంలో చేసిన పాత్ర ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. 600 థియేటర్స్‌లో విడుదలైన మా సినిమాకు మరో 60 థియేటర్స్‌ పెంచాం. సినిమా విడుదలైన 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. ‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ‘అభిమన్యుడు’. ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలని విశాల్‌గారు అనుకుంటున్నారు. గురువారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించనున్నాం. విశాల్‌ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ‘పందెంకోడి’కి సీక్వెల్‌గా విశాల్‌గారు చేస్తున్న ‘పందెం కోడి’ 2 రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. దసరాకు సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.  

మరిన్ని వార్తలు