పెహెలా పచ్చీస్‌

27 Nov, 2018 00:04 IST|Sakshi

‘పెహెలా’ అంటే హిందీలో మొదటి అని అర్థం. ‘పచ్చీస్‌’ అంటే తెలిసిందే! పాతిక. పాతిక సినిమాల మైలు రాయిని ‘పైలా పచ్చీసు’గా దాటేసిన స్టార్ల స్టేటస్‌ ఇది.

సినీ కెరీర్‌ మొదలెట్టాక ఏదో ఒక ఘనతను సాధించడానికి  ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌ల  హయాం వేరు. వాళ్లు రోజుకు మూడు సినిమాల్లో మూడు షిఫ్ట్‌ల లెక్కన పని చేసేవారు. కనుక 50, 100, 200 సినిమాల మైలురాళ్లను దాటటం కష్టం కాలేదు. ఇవాళ్టి  స్పీడులో, రోజుకో కొత్త హీరో పుట్టుకొచ్చే కాంపిటీషన్‌లో,  ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అవడానికి చోటు చేసుకుంటున్న గ్యాప్‌లో పది ఇరవై సినిమాలు చేయడం పెద్ద విషయం అయ్యింది. ఈ నేపథ్యంలో కెరీర్‌లో కీలకమైన మైలురాళ్లను దాటనున్న నటీనటులు కొందరు తాము ఘనత సాధించినందుకు తల ఎత్తుకు నిలబడి కనిపిస్తున్నారు. 

ఫుల్‌ ఫామ్‌
‘ప్రేమకథ’ (1999)తో అక్కినేని మరో వారసుడిగా తెర మీదకు వచ్చారు సుమంత్‌. ఆ తర్వాత ‘సత్యం’, ‘గౌరి’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్‌’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారు సుమంత్‌. ఎంతోమంది కొత్త హీరోల రాకతో ఆటుపోట్లకు గురైన ఆయన కెరీర్‌ ఇటీవల ‘మళ్ళీరావా’ హిట్‌తో ఆశావహంగా ఉంది.  ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌లో అక్కినేని నాగేశ్వరరావులా నటిస్తున్న సుమంత్‌ అచ్చు తాతగారిలా కనిపిస్తున్న స్టిల్స్‌ విడుదల చేశారు. ఆయన తాజా సినిమా ‘సుబ్రమణ్యపురం’ ట్రైలర్‌ స్థాయి నుంచే బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. అది సుమంత్‌ 25వ సినిమా కావడం వల్ల ఈ మైలురాయి మరో మంచి హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

ఆడా ఉంటా.. ఈడా ఉంటా
డబ్బింగ్‌ సినిమా ‘పందెం కోడి’తో గోదాలో దిగిన విశాల్‌ నాటి నుంచి డబ్బింగ్‌ సినిమాలతోనే తెలుగు గోదాలో జూలు విదిల్చుకుని నిలుస్తున్నారు. ఆల్‌మోస్ట్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు చేస్తున్న భ్రాంతి కలిగిస్తున్న నటుడు ఆయన. బాల దర్శకత్వంలో చేసిన ‘వాడు–వీడు’ విశాల్‌కు నటుడిగా పేరు తెచ్చింది. ఇటీవలి ‘డిటెక్టివ్‌’, ‘అభిమన్యుడు’ సినిమాలు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను చెదరకుండా కాపాడాయి. వేగంగా సినిమాలు చేసినప్పటికీ 25వ సినిమా మైలురాయి దాటడానికి ‘పందెం కోడి 2’ వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తెలుగు, తమిళంలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ అంత పే చేయకపోయినా మాస్‌ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. విశాల్‌ ప్రస్తుతం ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌ ‘అయోగ్య’లో నటిస్తున్నారు. 

రకుల్‌ ఎక్స్‌ప్రెస్‌
‘పవిత్ర.. ప్రతి పైసా కౌంట్‌ ఇక్కడ’తో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో సందడి చేశారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అంతకుముందు ‘కెరటం’ సినిమా చేసినా కెరీర్‌కి ప్లస్‌ కాలేదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ టైటిల్‌కి తగ్గట్టుగా రకుల్‌ కెరీర్‌ వేగం అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న రకుల్‌ హిందీలో చేసిన ‘అయ్యారీ’తో కలిపి ఇప్పటికి 22 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం  వెంకీ–నాగచైతన్య ‘వెంకీ మామ’, యన్‌.టి.ఆర్‌ బయోపిక్, తమిళంలో సూర్య ‘ఎన్‌జీకే’, కార్తీ ‘దేవ్‌’, బాలీవుడ్‌లో అజయ్‌ దేవ్‌గన్‌ ‘దేదే ప్యార్‌దే’, తదితర ఏడు సినిమాలు ఉన్నాయి. రిలీజ్‌ ఆర్డర్‌ బట్టి రకుల్‌ 25వ సినిమా ఏంటో తెలియడానికి కొంతకాలం వేచి ఉండక తప్పదు. 

జోరు మీదున్నారు
కోలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోలలో విజయ్‌ సేతుపతి ఒకరు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ స్థాయి నుంచి స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయన స్క్రిప్ట్‌ నచ్చితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ చేస్తున్నారు. సేతుపతి హీరోగా వచ్చే నెలలో రిలీజ్‌ కానున్న ‘సీతకాత్తి’ ఆయన 25వ చిత్రం. కనుక దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అలాగే మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌  ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లయడిత్తాల్‌’ సినిమాతో 25వ మైలురాయిని చేరుకున్నారు. 

అరుదైన రికార్డ్‌
వానకు తడవని వాడు, షకీలా పోస్టర్‌ను గోడ మీద చూడని వాడు దాదాపు తెలుగునాట ఉండడు. ఆమె అంత ఫేమస్‌.  దాదాపు సౌత్‌ భాషలన్నింటిలోనూ నటించారు. ఈ ఏడాది ఆమెకు సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె తన 250వ చిత్రం ‘శీలవతి’లో నటించారు. ఈరోజుల్లో ఇది అరుదైన రికార్డ్‌. సాయిరామ్‌ దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమా షకీలాకు అంత ఆనందాన్ని మిగల్చలేదనాలి. ‘శీలవతి’ సినిమా రిలీజ్‌ కోసం, సెన్సార్‌ చిక్కులను గట్టెక్కించడం కోసం టీమ్‌ అంతా కష్టపడ్డారు. అన్నట్లు.. షకీలా జీవితంపై హిందీలో ఓ బయోపిక్‌ రూపొందుతోంది. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షకీలా’గా రిచాచద్దా నటిస్తున్నారు. షకీలా ఓ గెస్ట్‌ రోల్‌ చేయడం విశేషం.

ఆల్‌ రౌండర్‌
‘మా పల్లెలో గోపాలుడు’ (1985)తో తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా చేరువయ్యారు అర్జున్‌.  ఆ తర్వాత ‘ప్రతిధ్వని’, ‘మా ఊరి మారాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి హిట్స్‌ ఎన్నో ఇచ్చారు. తమిళంలో చేసిన ‘జంటిల్‌మెన్‌’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు తెలుగులో ఆయనకు భారీ విజయం ఇచ్చాయి. ‘జైహింద్‌’, ‘అభిమన్యు’  యాక్టర్‌గా ఆయన స్థాయిని పెంచిన చిత్రాలు. ఇండస్ట్రీలో దాదాపు 35 ఏళ్ల  ప్రస్థానం ఉన్న అర్జున్‌ తమిళ, కన్నడ బైలింగ్వుల్‌ ‘నిబునన్‌’ చిత్రంతో 150వ చిత్రం మైలురాయి చేరుకున్నారు. ఈ సినిమాకు కన్నడలో ‘విస్మయ’ అనే టైటిల్‌ పెట్టారు. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. తెలుగులో ఈ ఏడాది ‘కురుక్షేత్రం’గా ఈ సినిమా రిలీజైంది. కానీ ఈ మైలురాయి చిత్రం అర్జున్‌కు  చేదు అనుభవాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్‌గా నటించిన నటి శృతీ హరిహరన్‌ అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ విషయం పక్కన పెడితే అర్జున్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా బిజీగా ఉంటున్నారు. ‘లై’, ‘అభిమన్యుడు’ సినిమాల్లో విలన్‌గా నటించి ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నారు.

ఆగని పరుగు
‘నిన్నేప్రేమిస్తా’, ‘పెళ్లి సందడి’, ‘ప్రేయసిరావే’, ‘ఎగిరే పావురమా’ వంటి లవ్‌స్టోరీలు ‘చాలా బాగుంది’, ‘మనసులో మాట’, ‘ఆమె’, ‘దీవించండి’ వంటి కుటుంబకథా చిత్రాలు, ‘ఖడ్గం’, ‘మహాత్మ’, ‘ఆపరేషన్‌ దుర్యోధన’ వంటి యాక్షన్‌ సినిమాలు శ్రీకాంత్‌ సొంతం.  ‘పెళ్లాం ఊరెళితే’, ‘క్షేమంగావెళ్లి లాభంగా రండి’ చిత్రాలతో ప్రేక్షకులకు కితకితలు పెట్టే ప్రయత్నం చేశారాయన.  ఇప్పుడాయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఇండస్ట్రీలో ఉన్నారు. గతేడాది శ్రీకాంత్‌ నటించిన ‘రారా’ ఆయన కెరీర్‌లో 125వ సినిమా. కానీ ఈ సినిమా ఆయనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్‌ క్రెడిట్‌ విషయంలో ఇష్యూ జరిగింది. డైరెక్టర్‌ పేరు లేకుండానే సినిమాను విడుదల చేశారు. తాజాగా శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ 2019’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 125తో శ్రీకాంత్‌ పరుగు ఆగదు. 150 కూడా చేరుకునే అవకాశం ఉంది.


ఎంతో దూరంలో లేరు
‘ఎనీ సెంటర్‌ సింగిల్‌ హ్యాండ్‌ గణేశ్‌’ అని డైలాగ్‌ చెప్పినట్టుగా అప్రతిహతంగా ఏ సినిమా అయినా చేసే సత్తాతో ముందుకు సాగుతున్నారు వెంకటేశ్‌. ఆయన హిట్లు రాయాలంటే ఇక్కడ స్థలం చాలదు. ఈ ఏడాది డిసెంబర్‌లో స్టార్ట్‌ అవ్వబోయే ‘వెంకీమామ’ ఆయనకు 73వ చిత్రం. ఇది కాకుండా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ఓ సినిమా చేయాలి. అలాగే ‘నేను లోకల్‌’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అంటే.. 75వ సినిమాకి ఎంతో దూరం లేదు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’ సినిమాలో నటిస్తున్నారాయన. 

ఫుల్‌ బిజీ!
‘దేశ ముదురు’తో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక ఇక్కడ స్టార్‌డమ్‌ సంపాదించుకుని తమిళ్‌కి వెళ్లారు. అక్కడినుంచి మళ్లీ తెలుగుకి రాలేనంత బిజీ అయ్యారు. మధ్య మధ్యలో తెలుగు సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో 50వ చిత్రం ‘మహా’లో నటిస్తున్నారు. ఈ తమిళ చిత్రానికి జమీల్‌ దర్శకుడు. 

మరిన్ని వార్తలు