భారీ వసూళ్లతో దుమ్మురేపిన స్పైడర్‌!

1 Oct, 2017 20:46 IST|Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'స్పైడర్‌'. దసరా పండుగ సందర్భంగా గత బుధవారం ఈ సినిమా విడుదలైంది. సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్‌ బాబు 'స్పై'గా నటించాడు. దర్శకుడు ఎస్‌జే సూర్య.. మనుష్యులు ఏడిస్తే చూసి ఆనదించే సైకోగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చిందని వినిపిస్తున్నా.. దసరా సెలవుల్లో రావడం.. మహేశ్‌బాబు-మురుగదాస్‌ కాంబినేషన్‌పై అంచనాలు ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా టాక్‌ ఎలా ఉన్నా.. 'స్పైడర్‌' వసూళ్లు దుమ్మురేపేలా ఉన్నాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

వారం మధ్యలో విడుదలైనప్పటికీ 'స్పైడర్‌'.. తొలిరోజే కళ్లుచెదిరేరీతిలో రూ. 51 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండురోజుల్లో రూ. 72 కోట్లు వసూలుచేసినట్టు చిత్రయూనిట్‌ శుక్రవారం ధ్రువీకరించింది. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన.. స్పైడర్‌ వారాంతంలో రూ. 100 కోట్ల క్లబ్బులో చేరవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి తొలివారంలోనే ఈ సినిమాకు రూ. 100 కోట్లు ఖాయమనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు