ఆ క్షణాలను గుర్తు చేసుకున్న స్రవంతి కిశోర్‌

9 May, 2020 15:58 IST|Sakshi

‘‘కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను అవ‌త‌లివాళ్లు చెబుతుంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. మ‌రికొన్నిసార్లు న‌మ్మ‌బుద్ధి కాదు. ఆ మాట‌ల్లో అతిశ‌యోక్తులు ధ్వ‌నిస్తాయి. కానీ అలాంటి సంఘ‌ట‌న‌లు మ‌న జీవితంలో ఎదురైన‌ప్పుడు? అవే దృశ్యాలు మ‌ళ్లీ మ‌ళ్లీ క‌ళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు  మా `రెడ్‌` యూనిట్ స‌భ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్‌`టీమ్‌లో ఈ  మ‌ధ్య దీనికి సంబంధించిన చ‌ర్చే  ఎక్కువ‌గా జ‌రుగుతోంది`` అని అంటున్నారు ప్ర‌ముఖ నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్‌. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్‌`. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా న‌టించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ  ఇట‌లీలో జ‌రిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇట‌లీ గురించి, అక్క‌డ ఆ వైర‌స్ సోక‌డానికి కొన్నాళ్ల ముందు గ‌డిపిన క్ష‌ణాల గురించి`స్ర‌వంతి` ర‌వికిశోర్ వివ‌రించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’)
 

`స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ.. ``స‌ముద్ర మ‌ట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌తో, ఎటుచూసినా స్వ‌చ్ఛంగా సుంద‌రంగా ఉంటుంది డోల‌మైట్స్. ఈ ప‌ర్వ‌త తీర ప్రాంతంలో ఇప్ప‌టిదాకా ప‌లు హాలీవుడ్ సినిమాల షూటింగులు జ‌రిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న `రెడ్‌` షూటింగ్ అక్క‌డ చేద్దామ‌ని మా డైర‌క్ట‌ర్ కిశోర్ తిరుమ‌ల అన్నారు. అప్ప‌టికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబ‌ట్టి వెంట‌నే ఓకే అనుకున్నాం. రెండు పాట‌లు చిత్రీక‌రించ‌డానికి టీమ్‌తో ఇట‌లీ చేరుకున్నాం. టుస్కాన్‌, ఫ్లారెన్స్, డోల‌మైట్సలో హీరో రామ్‌, హీరోయిన్ ‌మాళవికా శర్మ మీద పాట‌లు చిత్రీక‌రించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరిక‌ల్‌ సాంగ్‌లో లేక్‌గార్డ్‌ అందాలు కూడా క‌నిపిస్తాయి. లేక్‌గార్డ్‌ ప్ర‌స్తావ‌న ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవ‌లం గంటం పావు ప్ర‌యాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇట‌లీలో కోవిడ్-19కి ఎపిక్ సెంట‌ర్‌గా బెర్గామో గురించి అంద‌రికీ తెలిసిందే.  ఫిబ్ర‌వ‌రి15న లేక్ గార్డ‌లోనూ, ఫిబ్ర‌వ‌రి 16న డోల‌మైట్స్‌లోనూ షూటింగ్ చేశాం. మేం అక్క‌డి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజుల‌కు... అంటే ఫిబ్ర‌వ‌రి 22న డోల‌మైట్స్‌కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్‌ ఇదే ఫస్ట్‌ టైమ్‌..)

ఇక ‘‘అక్క‌డికి వెళ్లిన 22 మందిలో 17 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అప్ప‌టిదాకా సుంద‌రంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోల‌మైట్‌ గురించి ఆలోచించ‌గానే మ‌మ్మ‌ల్ని క‌రోనా క‌ల‌వ‌ర ‌పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్క‌డి నుంచి వ‌చ్చిన మా యూనిట్ అంతా  సుర‌క్షితంగా ఉంది. ఇలాంటి విష‌యాల గురించి ఆలోచించిన‌ప్పుడు అదృష్టం కాక మ‌రేంటి? అని అనిపిస్తుంది. ఈ విష‌యాన్నే అక్క‌డ పాట‌ల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన శోభి మాస్ట‌ర్‌,  మా యూనిట్ స‌భ్యులు గుర్తుచేస్తున్నారు. ఇట‌లీలోనే కాదు మ‌న ద‌గ్గ‌రా క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వైర‌స్ బారి నుంచి త‌ప్పించుకోవ‌డ‌మే మ‌న ముందున్న క‌ర్త‌వ్యం. మాన‌వాళి సుర‌క్షితంగా ఉండాల్సిన ఈ త‌రుణంలో వినోదం గురించి ఆలోచించ‌డాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్‌’ విడుద‌ల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు​.  స‌మాజం మామూలు స్థితికి వ‌చ్చాక‌, అప్పుడు `రెడ్‌` విడుద‌ల గురించి ప్ర‌క‌టిస్తాం. క‌రోనా కోర‌ల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఉండాలి. ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం )

కాగా రామ్‌, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

మరిన్ని వార్తలు