చెన్నై కమిషనరేట్‌లో శ్రీరెడ్డి ఫిర్యాదు

27 Feb, 2020 07:38 IST|Sakshi

పెరంబూరు: సంచలన నటి  శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకు ముందు లైంగిక ఆరోపణలతో తెలుగు, తమిళ సినీపరిశ్రమల్లో కలకలం సృష్టించిన ఈ అమ్మడు తాజాగా తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు  బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... అసభ్యకర పోస్ట్‌లు పెట్టారంటూ శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, నృత్యదర్శకుడు రాకేశ్‌ మాస్టర్‌ తెలంగాణా రాష్ట్ర క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో  క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు  శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

(కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు)

ఈ నేపథ్యంలో  శ్రీరెడ్డి... నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్‌ మాస్టర్‌పై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపారు. అయితే కరాటే కల్యాణి, రాకేశ్‌ మాస్టర్‌ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసభ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నట్లు చెప్పారు. తనను పెట్రోల్‌ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపారు. (శ్రీరెడ్డి దొరికిపోయింది)

మరిన్ని వార్తలు