మానవ హక్కుల సంఘానికి నటి శ్రీరెడ్డి ఫిర్యాదు

28 Mar, 2019 09:22 IST|Sakshi

పెరంబూరు: నటి శ్రీరెడ్డి, నిర్మాత రవిదేవన్‌తో కలిసి మంగళవారం చెన్నైలోని మానవ హక్కుల సంఘంలో ఒక ఫిర్యాదు చేసింది. తెలుగు నటి శ్రీరెడ్డి ఆ మధ్య టాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల చెన్నైలో మకాం పెట్టింది. అంతే కాదు రెడ్డి డైరీ పేరుతో ఆమె బయోపిక్‌గా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో తనే ప్రధాన పాత్రను పోషిస్తోంది. కాగా కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర ఫైనాన్సియర్‌ సుబ్రమణి, మరో వ్యక్తి తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ తరువాత ఆ కేసును తను వెనక్కి తీసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో తానా కేసును వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని శ్రీరెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చి వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో  ఈ సంచలన నటి మంగళవారం చెన్నైలోని మానవహక్కుల సంఘంలో తనకు జరిగిన మానవహక్కుల అతిక్రమణ గురించి ఫిర్యాదు చేసింది. అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రెడ్డి డైరీ చిత్ర షూటింగ్‌ కోసం చెన్నైకి వచ్చానని చెప్పింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రెడ్డి డైరీ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పింది. దీంతో వారం రోజులుగా చిత్ర షూటింగ్‌ నిలిచిపోయ్యిందని తెలిపింది. దీంతో చిత్ర నిర్మాత, ఇతర యూనిట్‌ వర్గాలకు తీవ్ర నష్టం కలిగిందని చెప్పింది. అందువల్లే తాను ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి పేర్కొంది.

మరిన్ని వార్తలు