తమషాగా ఉంటుందట

11 Nov, 2013 01:23 IST|Sakshi
తమషాగా ఉంటుందట
 ‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, నీలం ఉపాధ్యాయ, సునీత మార్షియా ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమాషా’. ఎం.విజయవర్దన్‌రావు, శివారెడ్డి నీలపు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణ గోగుల కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీనివాస్ బల్లా అద్భుతమైన కథ తయారు చేశారు. మలయాళ దర్శకుడు సిద్దిక్ శిష్యుడైన శ్రీనివాస్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తీస్తారనే నమ్మకం మాకుంది’’ అని చెప్పారు.
 
  నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని దర్శకుడు చెప్పారు. మంచి నిర్మాతలు దొరికితేనే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని, అనుకున్నట్లే మంచి నిర్మాతలు దొరికారని శ్రీ అన్నారు. సంగీతానికి మంచి ఆస్కారం ఉన్న సినిమా ఇదని సంగీత దర్శకుడు రఘురాం అన్నారు. సయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రవిప్రకాష్, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జి.సందీప్, సంగీతం: రఘురామ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.రావు, నిర్మాణ సారథ్యం: ఎస్.ముకుందరావు.