50 వసంతాల సాధనలో శ్రీదేవి

24 May, 2017 02:22 IST|Sakshi
50 వసంతాల సాధనలో శ్రీదేవి

అతిలోక సుందరిగా ఎందరో అభిమానులు ఆరాధించే నటిగా ఎదిగిన నటి శ్రీదేవి. నటిగా 50 వసంతాల శిఖరాన్ని అధిగమించిన ఈ సుందరి ఆబాలగోపాల మనసుల్ని దోచుకున్నారు. శ్రీదేవి 1967 జూలై నెల 7వ తేదీన తుణైవన్‌ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగప్రవేశం చేశారు. అలా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీదేవి ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నాయకిగా నటించి అశేష ప్రేక్షకులను అలరిస్తున్నారు.

తాజాగా శ్రీదేవి నటించిన చిత్రం మామ్‌. ఈ చిత్రాన్ని తన భర్త, నిర్మాత బోనీకపూర్‌ జిడియోస్, ఏ మ్యాడ్‌ ఫలింస్‌ అండ్‌ థర్డ్‌ ఐ ప్రొడక్షన్స్‌ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శ్రీదేవినే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీదేవి 50 వసంతాల సాధనను పురస్కరించుకుని జూలై నెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు