విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

17 Oct, 2019 08:56 IST|Sakshi

తమిళ సినిమా: కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్‌ హీరోయిన్‌ శ్రీనిధి శెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌ పిలుస్తోంది. చియాన్‌ విక్రమ్‌తో జతకట్టే అవకాశం ఆమె ముంగిట వాలిందనేది తాజా సమాచారం. ప్రయోగాలకు బ్రాండ్‌అంబాసిడర్‌ నటుడు విక్రమ్‌ అన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పాత్రల కోసం ఎంత వరకైనా వెళ్లే విక్రమ్‌ కడారం కొండాన్‌ చిత్రం తరువాత కొత్త చిత్రానికి రెడీ అయిపోయారు. ఈయన ఇమైకా నొడిగళ్‌ చిత్రం ఫేమ్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మాత లలిత్‌కుమార్‌ వైకం 18 స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇటీవలే ప్రారంభమై సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

కాగా ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఇందులో నటుడు విక్రమ్‌ పలు గెటప్‌లలో కనిపించనున్నారని సమాచారం. అదేవిధంగా దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ చిత్రం ద్వారా నటుడిగా తెరరంగేట్రం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాభవానీశంకర్‌ను హీరోయిన్‌గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇండియన్‌–2లో కమల్‌ హాసన్‌తో, ఎస్‌జే.సూర్యకు జంటగా కొత్త చిత్రం అంటూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ప్రియాభవానీశంకర్‌ విక్రమ్‌ చిత్రానికి కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి అని తెలిసింది. 

దీంతో తాజాగా నటి శ్రీనిధిశెట్టిని విక్రమ్‌కు జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ కన్నడంలో ఆ మధ్య తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్‌ చిత్రంలో నాయకిగా నటించిందన్నది గమనార్హం. కన్నడంలో మంచి స్టార్‌గా రాణిస్తున్న శ్రీనిధిశెట్టిని ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విక్రమ్‌కు జంటగా ఆమెను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ఇది నటుడు విక్రమ్‌కు 58వ చిత్రం అవుతుంది. దీనికి శివకుమార్‌ విజయన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు