పాతికేళ్ల క్రితం వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమాను ఇప్పుడు చూసినా నవ్వుకోకుండా ఉండలేరు. అంత క్రేజ్ ఉండబట్టే అదే టైటిల్తో జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా కొత్త సినిమా రూపొందుతోంది. శివమ్ సెల్యూలాయిడ్స్ అండ్ మ్యాన్లైన్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి, జోజో జోష్, శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. బి. సురేష్ రెడ్డి సహ నిర్మాత.
ఈ సినిమాలో కథానాయికగా మోడల్ కమ్ థియేటర్ ఆర్టిస్ట్ సిద్ధీ ఇద్నానీని ఎంపిక చేసినట్లు చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ‘‘చాలా రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించాం. కథానాయిక పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధీ ఇద్నానీని ఎంపిక చేశాం’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘ఆడిషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత టెస్ట్ షూట్ చేశారు. ఒక మంచి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధీ ఇద్నాని. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్.