ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో వచ్చిన ‘జంబలకిడి పంబ’ సినిమా ప్రేక్షకులకు ఎన్ని నవ్వులు పంచిందో.. ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పురుషులు మహిళల్లా.. మహిళలు పురుషుల్లా మారి తెగ నవ్వులు పూయించారు. తాజాగా శ్రీనివాసరెడ్డి హీరోగా ‘జంబలకిడి పంబ’ సినిమా తెరకెక్కుతోంది. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రాల తర్వాత శ్రీనివాసరెడ్డి హీరోగా చేస్తోన్న మూడో చిత్రమిది. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. వైకుంఠ ఏకాదశి రోజున మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా చిత్రకథకు చక్కగా సరిపోయే టైటిల్ ‘జంబలకిడి పంబ’. టైటిల్ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అన్నారు మురళీకృష్ణ. సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.