ఒక్క సెల్ఫీతో ఇండియన్‌ సినిమా!

30 Dec, 2017 12:22 IST|Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ నటుడిగానే కాదు.. బిజినెస్‌ మాన్‌గా కూడా సక్సెస్‌ అయ్యాడన్నది తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ, ఐపీఎల్‌ జట్టుతోపాటు పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సౌత్‌ స్టార్లతో కలిసి ఓ ఈవెంట్‌లో చేసిన సందడి చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. 

కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌ సంస్థ తమ కొత్త బ్రాంచ్‌లను మస్కట్‌(ఒమన్‌)లో ప్రారంభించింది. ఈ లాంఛింగ్‌ కార్యక్రమానికి తారా లోకం కదిలి వచ్చింది. సౌత్‌లో ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని(టాలీవుడ్‌), శివరాజ్‌కుమార్‌(శాండల్‌వుడ్‌), ప్రభు(కోలీవుడ్‌), మంజువారియర్‌(మాలీవుడ్‌)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

బాలీవుడ్‌లో ఈ సంస్థకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ అంబాసిడర్‌ అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యకారణాలతో ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాగా, ఆ లోటును షారూఖ్‌ తీర్చినట్లయ్యింది. దీంతో సౌత్‌ స్టార్లు, కింగ్‌ ఖాన్‌తో దిగిన ఓ సెల్ఫీ వైరల్‌ అవుతోంది. ఒక్క ఫ్రేమ్‌లో టోటల్‌ ఇండియన్‌ సినిమాను చూపించారంటూ ఆ ఫోటో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు