గ్యాంగ్‌స్టర్‌గా శ్రుతి

2 Jun, 2018 09:12 IST|Sakshi

తమిళసినిమా: నాటి తరం చిత్రాల్లో హీరోయిన్లను గ్యాంగ్‌స్టర్స్‌గా ఎక్కువగా చూసి ఉంటాం. ఇటీవల అసలు ఆ తరహా చిత్రాలే తగ్గిపోయాయి. ఇక హీరోయిన్లను గ్యాంగ్‌స్టర్స్‌గా చూసే అవకాశం ఎలా ఉంటుంది? అయితే తాజాగా ఆ కొరత తీర్చడానికి అందాల భరిణి శ్రుతిహాసన్‌ రెడీ అవుతున్నారు. ఈ సంచన నటి నాయకిగా పరిచయమైంది బాలీవుడ్‌లోనే అన్న సంగతి తెలిసిందే.  ఆ తరువాత తెలుగు, తమిళం అంటూ పలు భాషల్లో చుట్టేశారు. ప్రస్తుతం చిన్న గ్యాప్‌ తీసుకుని మరో ఇన్నింగ్‌ను కెరీర్‌ ఎక్కడ ప్రారంభించారో అక్కడి నుంచే మొదలెట్టనున్నారు. తొలి హిందీ చిత్రం లక్కులో అందాలారబోసి సంచలనం కలిగించిన శ్రుతిహాసన్‌ తాజాగా గ్యాంగ్‌స్టర్‌లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్‌జమ్మాల్‌ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి కథానాయకిగా నటిస్తున్నారు.

ఇందులో ఆమె  గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించారు. పిరియడ్‌ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ చిత్ర తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల ముంబయిలో పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్‌ను గోవాలో చిత్రీకరించనున్నారు. దీంతో మహేశ్‌మంజ్రేకర్‌ తన చిత్ర బృందంతో గోవాకు పయనం అవుతున్నారు. ఈ షెడ్యూల్‌లో నటి శ్రుతిహాసన్‌ పాల్గొనబోతున్నారు. సాధారణంగా మహేశ్‌మంజ్రేకర్‌ చిత్రాలలో హీరోలతో పాటు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలోనూ శ్రుతి పాత్ర కీలకంగా ఉంటుందంటున్నారు దర్శకుడు. ఇందులో శ్రుతిహాసన్‌ గురించి ఆయన తెలుపుతూ  చిత్రంలో శ్రుతిహాసన్‌ పాత్ర ఇతర పాత్రల్లోని జీవితాలపై చాలా ప్రభావం చూపేదిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం లండన్‌లో తన అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌కు సంబంధించిన పనులను పూర్తి చేసుకుంటున్నారని, త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో నటించడానికి గోవా బయలు దేరనున్నారు. ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి కాగానే శ్రుతి తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న శభాష్‌ నాయుడు చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని ఆమె తరఫు వర్గాలు తెలిపారు.

మరిన్ని వార్తలు