సూపర్‌ కాంబినేషన్‌ ఫిక్స్‌

19 Apr, 2020 03:32 IST|Sakshi
రాజమౌళి, మహేశ్‌బాబు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎవరు హీరోగా నటించబోతున్నారనే సస్పెన్స్‌కు శనివారం తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటించబోతున్నట్లు వెల్లడించారు రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌ కుదిరింది. దీంతో సూపర్‌ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయ్యిందని సంబరపడిపోతున్నారు మహేశ్‌ ఫ్యాన్స్‌.

ఈ చిత్రాన్ని కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు.  ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు రాజమౌళి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడటంతో ప్రస్తుతం వీడియో కాల్‌ ద్వారా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. మరోవైపు మహేశ్‌ తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనుందనే ప్రచారం జరగుతోంది. మహేశ్, రాజమౌళి ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనుకోవచ్చు.

మరిన్ని వార్తలు