గోపీచంద్ సరసన...

15 Jul, 2016 23:09 IST|Sakshi
గోపీచంద్ సరసన...

సిమ్లా యాపిల్‌లా ఉండే హన్సిక మళ్లీ తెలుగులో నటించనున్నారు. ఈ ఏడాది ‘కళావతి’గా భయపెట్టినా, గతేడాది ‘మగ మహారాజు’, ‘పులి’ చిత్రాల్లో సందడి చేసినా.. అవన్నీ డబ్బింగ్ సినిమాలే. ఈ బ్యూటీ స్ట్రయిట్ తెలుగు చిత్రంలో నటించి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పుడు ఓ స్ట్రయిట్ సినిమా అంగీకరించారు. గోపీచంద్ కథానాయకునిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా నటించనున్నారామె. గోపీచంద్, హన్సిక జంటగా నటించనున్న తొలి చిత్రమిది.

ప్రభాస్‌తో ‘రెబల్’, గోపీచంద్ హీరోగా ‘శంఖం’ వంటి చిత్రాలను నిర్మించిన శ్రీ బాలాజీ సినీ మీడియా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనుంది. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్రతినాయకుడిగా మంచి పేరొచ్చిన తర్వాత ‘యజ్ఙం’తో కథానాయకునిగా మారారు గోపీచంద్. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మాస్, యాక్షన్ చిత్రాలు చేసినప్పటికీ.. ‘లౌక్యం’తో కామెడీ బాట పట్టారు.

ఇటీవల యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఈ తరహాలోనే గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే మంచి కథను దర్శకుడు సంపత్ నంది సిద్ధం చేశారట. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అవకాశం రావడం పట్ల హన్సిక సంతోషం వ్యక్తం చేశారు.