‘మానాడు’కు సిద్ధమవుతున్న శింబు

4 Jun, 2019 10:12 IST|Sakshi

నటుడు శింబు మానాడు చిత్రానికి రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్‌ తరువాత మణిరత్నం చిత్రం సెక్క సివంద వానం సక్సెస్‌తో ఖుషీగా ఉన్న శింబును ఆ తరువాత సుందర్‌.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రం నిరాశ పరిచింది. కాగా అప్పటికే వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నట్లు ప్రకటను వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం హోరెత్తింది. దీంతో చిత్ర నిర్మాత సురేశ్‌ కామాక్షి మానాడు ఆగిపోలేదని, రూపొందుతుందని స్పష్టం చేశారు.

సినిమా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో అసలు మానాడు చిత్రం ఉంటుందా? అనే అనుమానాలు కోలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా సెట్‌కు వెళ్లనుందనే సమాచారం తెలిసింది. ప్రస్తుతం శింబు నటి హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ చిత్రం మహాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. వాలు చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ శింబు, హన్సిక ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ జంట ఇప్పుడు మహా చిత్రంలో కలిసి నటించడం విశేషం.

ప్రస్తుతం మహా చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. శింబు, హన్సికల ప్రేమ సన్నివేశాలను దర్శకుడు జమీల్‌ చిత్రీకరిస్తున్నారు. ఇందులో శింబు పైలెట్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ నెలాఖరున మానాడు చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ నటించనున్నారు. కాగా మరో ప్రధాన పాత్రలో సీనియర్‌ దర్శకుడు భారతీరాజా నటించనున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు