దేవుడు ఆగ్రహిస్తే..

9 Aug, 2018 00:45 IST|Sakshi
సుమంత్‌

‘మళ్ళీ రావా’ వంటి హిట్‌ చిత్రం తర్వాత సుమంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషా రెబ్బా కథానాయిక. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్‌ ఇంపెక్స్‌ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘సుమంత్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న 25వ చిత్రమిది. సూపర్‌ నేచురల్‌ అంశాల మేళవింపుతో సాగే మంచి మిస్టరీ థ్రిల్లర్‌.

తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. యాభై శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామిపై ఉన్న ఓ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంచి సాహిత్యం అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడేందుకు అంగీకరించారు’’ అన్నారు. ‘‘అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏంటి? అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సుమంత్‌ దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారు’’ అన్నారు సంతోష్‌. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర.

మరిన్ని వార్తలు